తెలంగాణలో ఈ రోజు కేవలం 7 కేసులు మాత్రమే నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 6, వరంగల్ అర్బన్లో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో తెలంగాణలో మొత్తంగా కరోనా పాజిటీవ్ కేసులు 990కి చేరాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారు. 658 మందికి చికిత్స అందిస్తుండగా.... 307 మంది డిశ్చార్జ్ అయ్యారు.
శుక్రవారం నాడు 13 కేసులు నమోదవగా, నేడు 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఊరటనిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో తెలంగాణ ప్రజలు కూడా కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యిని దాటేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 1016 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 171 మంది డిశ్చార్జ్ అవగా, కరోనా పాజిటివ్తో మరణించిన వారి సంఖ్య 31కి చేరింది
గడిచిన 24 గంటల్లోనే కేవలం కృష్ణా జిల్లాలోనే 25 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, విజయవాడలోని కార్మికనగర్లో మరో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల 15 మందికి పైగా కరోనా సోకిందన్నారు. భౌతికదూరం పాటించకుండా కలకత్తా నుండి వచ్చిన అతను ఇంటి దగ్గర వాళ్ళతో ఇండోర్ గేమ్స్ ఆడడం వల్ల వారికి కూడా కరోనా సోకడాం గమనార్హం.
ఈ ఇద్దరి నిర్వాకం వల్ల జిల్లాలో దాదాపు 40 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. రెడ్ జోన్లలో ఉండే ప్రజలు ఇప్పటికైనా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కలెక్టర్ కోరారు.
ఇదిలా ఉండగా…. కరోనా మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్న కర్నూలు జిల్లా ప్రజలకు శనివారం కాస్త ఊరట కలిగింది. కరోనా వైరస్ మహమ్మారి నుంచి మరో 24 మంది పూర్తిగా కోలుకున్నారు. ఒకే రోజు 24 మంది డిశ్చార్జి కావడంతో కర్నూలు జిల్లా వాసులకు బిగ్ రిలీఫ్ కలిగింది. దీంతో ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో మొత్తం 31 మంది కరోనా బారిపడిన పడ్డ బాధితులు క్షేమంగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.