కరోనా గండం నుంచి ఇక అగ్రరాజ్యం అమెరికా బయటపడినట్లేనని భావిస్తున్న తరుణంలో ఆ రక్కసి మళ్లీ కబళిస్తోంది. ఈ సారి వెయ్యి రెట్ల వేగంతో అమెరికాలో శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రాణాలు మాస్కుల్లో పెట్టుకుని బతుకుతున్నారు అక్కడి జనం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అమెరికాలో 24 గంటల వ్యవధిలోనే వేలాదిమందికి పాకింది. శనివారం నాటికి 50000 మంది ప్రాణాలు విడిచినట్లుగా డబ్ల్యూహెచ్వో లెక్కలు చెబుతున్నాయి. ప్రతీ రోజూ సగటున పదివేల కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఒక్కరోజే 1765మంది మరణించడంతో అమెరికా ప్రజల వెన్నులో వణుకుపుట్టిస్తోంది.
తాజాగా అమెరికాలో ఓ వైద్య బృందం నిర్వహించిన సర్వేలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాని పక్షంలో 3లక్షల మరణాలు సంభవించినా ఆశ్చర్యం లేదని వెల్లడించిందట. లక్షల్లో పాజిటివ్ కేసులు పెరుగుతూ పోవడం..రికవరీలు కూడా చాలా తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృత్యుహేల కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. బాధితుల సంఖ్య 29 లక్షలకు చేరువైంది. క్వారంటైన్లో పెడుతున్న ఆయా దేశ ప్రభుత్వాలు జనాలను ఎక్కువ రోజులు నిర్బంధంలో ఉంచడం కష్టసాధ్యంగా మారుతుండటంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి.
ప్రపంచం మొత్తం మీద సుమారు 175 దేశాలు, ప్రాంతాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. అమెరికాలో కరోనా ఉధృతి పెరుగుతుండగా మాస్కులు, శానిటైజర్లు ఇతర మందుల కొరత ఏర్పడుతోంది. దీనికి తోడు మెడికల్ దుకాణాల వ్యాపారులు అక్రమంగా నిల్వం చేస్తుండటం గమనార్హం. దీంతో అధ్యక్షుడు ట్రంప్ అలాంటి దుకాణాల లైసెన్స్లను రద్దు చేస్తామని, తక్షణమే షాపులను సీజ్ చేసి అందులోని నిల్వల స్వాధీనానికి ఆదేశాలు జారీ చేశారు. అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా నిల్వ చేసినా శిక్ష తప్పదన్నారు. అమెరికాలోని న్యూయార్క్లో ప్రస్తుతం కోవిడ్కు కేంద్ర బిందువుగా మారింది. అమెరికాలో కోవిడ్ బారిన పడ్డ ప్రతి ఇద్దరిలో ఒక్కరు న్యూయార్క్కు చెందిన వారే కావడం గమనార్హం.