దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఎంత దారుణంతో చూపిస్తుందో ప్రతిరోజూ పెరిగిపోతున్న కేసులను చూస్తుంటే తెలిసి పోతుంది. ప్రపంచ వ్యాప్తంగ ఇప్పటి వరకు రెండు లక్షల మంది కరోనా తో మరణించారు. అయితే కరోనాని అరికట్టడానికి చాలా దేశాల్లో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. మన దేశంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ మొదలైంది. అయితే కరోనా పూర్తి అదుపులోకి రాలేదు.. దాంతో మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించారు. అయితే లాక్ డౌన్ వల్ల ఎంతో మంది బీద ప్రజలు కష్టాలు పడుతున్నారు.
పేద ప్రజలను ఆదుకునేందుకు ఎంతో మంది దయార్థహృదయాలు ఉన్నవారు ముందుకు వస్తున్నారు. లాక్డౌన్తో సమస్యలను ఎదుర్కొంటున్న 41 అనాథ, వృద్ధాశ్రమాలు, ప్రత్యేక అవసరాలు కలిగినవారి ఆశ్రమాలను రాచకోండ పోలీసు కమిషనరేట్ దత్తత తీసుకుంది. వివిధ ఎన్జీవోల సహాయంతో వాటికి అవసరమైన నిత్యావసర వస్తువులు, కిరాణా సామాన్లు, మందులను పోలీసులు అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వలస కూలీల జీవితాలపై పరిశోధన జరిపారు.. వారిని ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. లాక్ డౌన్ సందర్బంగా అన్నదానాలు, ఇతర తిండి పదార్థాలు అందింస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉండటంతో ప్రజలు వారివారి ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇలాంటివారికి సహాయం చేయాలనుకునేవారు, ఆయా ఆశ్రమాల నిర్వహణను చూసేవారు బయటకు వచ్చే అవకాశం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. రాచకొండ ఈ ఆశ్రమాలకు రేషన్, ఆహారం, ఇతర పదార్థాల సేకరణ, పంపిణీని పోలీస్ కమిషనరేట్లోని సిటిజన్ వాలంటీర్ సెల్ నిర్వహిస్తున్నదని ఆయన వెల్లడించారు. మొత్తం 41 అనాథ, వృద్ధాశ్రమాలు, ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల ఆశ్రమల్లో సుమారు 1630 మంది ఉంటునట్లు గుర్తించామని తెలిపారు.