కరోనా నియంత్రణ లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న సామాన్యులు సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే చాలామంది లాక్ డౌన్ సమయంలో ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ లాక్ డౌన్ సమయంలో ఇక్కడ గ్రామస్తులు చేసిన పనితో మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామస్తులు అందరూ సమిష్టిగా ఊరికి ఉపయోగపడే ఒక గొప్ప పని చేశారు. లాక్ డౌన్ సమయంలో అందరూ ఊర్లో ఉండటంతో ఈ సమయాన్ని మొత్తం గ్రామానికి ఒక మంచి రోడ్డు నిర్మించుకునేందుకు వాడుకున్నారు. ఉత్తరాఖండ్ లోని ఖార్కి గ్రామంలో చోటు చేసుకుంది
వివరాల్లోకి వెళితే... కార్కి గ్రామాల్లో 40 కుటుంబాలు నివసిస్తున్నాయి. దాదాపు పదేళ్ల క్రితం ఈ గ్రామానికి ప్రభుత్వం ఓ రోడ్డు నిర్మించింది. మూడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డును వేశారు. ఇక ఆ తర్వాత ఈ రోడ్డును పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. కనీస మరమ్మతులు కూడా చేయలేదు. దీంతో గుంతలు గుంతలు గా మారిన రోడ్డు యమలోకానికి దారులుగా మారింది. దీనికితోడు అక్కడక్కడ కొండచరియలు విరిగిపడటంతో చెట్లు పొదలు పేరుకుపోయాయి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదు.
ఈ క్రమంలోనే గ్రామస్తులు అందరూ ఓ నిర్ణయం తీసుకున్నారు. అధికారులతో చెప్పుకుంటే సమయం వృధా తప్ప ఇంకేమీ ఉపయోగం ఉండదు అని భావించారు. తాము ఆ రోడ్డును బాగు చేయాలి అని నిర్ణయించుకున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం కావాల్సి రావటంతో అది సరైన సమయంగా భావించారు ఖార్కి గ్రామస్తులు. దీంతో గ్రామస్తులు అందరూ సమిష్టిగా పలుగు పార పట్టి రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. సరైన మరమ్మత్తు పరికరాలు లేకపోయినా తరచూ అక్కడ అడవి జంతువులు దాడులు జరుగుతాయని తెలిసిన కూడా... నెల రోజులు శ్రమించి రెండు మీటర్ల వెడల్పు గల రోడ్డు నిర్మించుకున్నారు గ్రామస్తులు. ప్రస్తుతం ఈ రోడ్డు గుండా మోటార్ సైకిల్ కూడా తిరుగుతున్నాయి. ఇక ఈ విషయం అధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో రోడ్డు నిర్మాణం కోసం సహాయం చేస్తామంటూ కలెక్టర్ కూడా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆ గ్రామస్తులు చేసిన ఆలోచనకు అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు.