వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలన నిర్ణయం తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ధరించే యూనిఫాం రంగును మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6 -10వ తరగతి చదివే విద్యార్థులకు గులాబీ రంగు యూనిఫాంను అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు తెలుపు, నీలం, ముదురు నీలం రంగు బట్టలు ధరిస్తున్న విద్యార్థులు.. వచ్చే విద్యాసంవత్సరంలో గులాబీ రంగులో మెరిసిపోనున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రంగు గులాబీ అనే సంగతి తెలిసిందే.
కాగా, ఏపీ విద్యాశాఖ నూతన వస్త్రాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. బాలురకు ప్యాంట్, షర్ట్, బాలికలకు పంజాబీ డ్రెస్ ఇస్తామని, విద్యార్థులకు పంపిణీ చేసే బట్టల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఏపీ విద్యా శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయంపై సహజంగానే పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వం పెద్ద మనసుతో స్పందించిందని పేర్కొంటున్నారు.
ఇదిలాఉండగా, కరోనా మహమ్మారిపై పోరాటం కోసం ఆర్థిక సాయం అందిస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కరోనా కట్టడి కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చే దాతలకు 100 శాతం పన్ను మినహాయింపు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 1961 నాటి ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు వర్తిస్తుందని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వి.ఉషారాణి తాను జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్ ద్వారా విరాళాలు ఇవ్వాలనుకునేవారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ పేరుపై పంపాలని సూచించారు. బ్యాంకు ద్వారా నగదు రూపంలో విరాళాలు ఇవ్వాలనుకునేవారు సెక్రీటేరియట్లోని ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు అకౌంట్లకు పంపవచ్చన్నారు. ఎస్బీఐ అకౌంట్ నెంబర్-38588079208, ఆంధ్రా బ్యాంకు అకౌంట్ నెంబర్-110310100029039 అని వెల్లడించారు.