తప్పుడు పనులు చేస్తే ఎప్పటికైనా...తగు శిక్ష అనుభవించాల్సిందే. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు లోకం మనల్ని గమనించడం లేదు అనుకునే పొరుగున ఉన్న దుర్మార్గ దేశమైన పాకిస్థాన్కు ఊహించని షాక్ తగిలింది. ఆ దేశం టెర్రరిస్టులకు ప్రత్యక్షంగా, పరోక్షంగాను ఆర్ధిక, ఆయుధ సాయం చేస్తున్న విషయం ప్రపంచం అంతా గమనిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ పరిస్థితికి తగినట్లుగా...కరోనా కష్టకాలంలో దేశానికి తగు షాక్ తగిలింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు తమ దేశం యొక్క దుస్థితిని బహిరంగంగానే తెలిపారు.
కరోనా తీవ్రస్ధాయిలో దాడి చేస్తున్న పేద దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. పాకిస్తాన్ ఇప్పటికే ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల వద్ద బోలెడంత బకాయి పడింది. కరోనా వచ్చి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు పాకిస్తాన్ ఆర్దిక మూలాలను దెబ్బతీసింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే పలు దఫాలు వివిధ దేశాలకు, వివిధ అంతర్జాతీయ ఆర్ధిక సంస్ధలకు విన్నపాలు చేశారు. దుర్బల పేద దేశాలకు ఇచ్చిన రుణాలను రద్దు చేయాలని ఆయన మొదట్లో ప్రపంచ దేశాలను బతిమాలుకున్నాడు. కానీ ఏ దేశమూ ఆర్దిక సాయానికి ముందుకు రావడం లేదు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ...ప్రస్తుత దారుణమైన పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ ఒక్క దేశమూ తమకు కనీసం ఒక్కటంటే ఒక్క డాలరైనా సాయం చేసి ఆదుకోలేదని వాపోయాడు. సోషల్ మీడియాలో తన మీద, తన ప్రభుత్వం మీద లేనిపోని దుష్ర్పచారం చేస్తున్నారంటూ మరోసారి ఆయన మండిపడ్డాడు.
ఇదిలాఉండగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ సమక్షంలోనే మరో నిర్వాకం జరిగింది. పాకిస్థాన్కు చెందిన ఓ మతగువురు ఆ దేశ ప్రధాని సమక్షంలోనే అత్యంత వివాదాస్పదంగా మాట్లాడారు. మహిళలు చేస్తున్న పాపాల కారణంగానే ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తున్నదని మౌలానా తారిఖ్ జమీల్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్కు చెందిన ఓ టీవీ చానల్ కరోనా రోగుల కోసం నిధుల సేకరించే లక్ష్యంతో లైవ్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జమీల్తోపాటు పాక్ ప్రధాని ఇమ్రాన్ కూడా పాల్గొన్నారు. ఇందులో జమీల్ మాట్లాడుతూ మహిళల సంప్రదాయానికి విరుద్ధమైన వస్త్రధారణ వల్లనే దేశంలో కరోనా వ్యాపిస్తున్నదని వ్యాఖ్యానించారు. పనిలో పనిగా ఆయన మీడియామీద కూడా విమర్శలు గుప్పించారు. మీడియా అబద్ధాలు చెప్పటంవల్ల కూడా కరోనా పెరుగుతున్నదన్నారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ మహిళలపై తన వ్యాఖ్యలను సమర్థించుకోవటం గమనార్హం.