ప్రపంచ దేశాలన్నీ కరోనా కోసం లాక్ డౌన్ విధిస్తే.. సెంట్రల్ అమెరికాలోని ఓ దేశంలో మాత్రం ఖైదీల కోసం లాక్ డౌన్ విధించారు. జైల్లో అలాంటి పరిస్థితులు ఎందుకొచ్చాయో తెలుసా.. ?
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇంతకు ముందెన్నడూ రాలేదు. కానీ ఓ జైలులో మాత్రం కొన్ని అత్యవసర పరిస్థితుల కారణంగా లాక్ డౌన్ కు దారి తీశాయి. సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్విడార్ అనే ప్రాంతంలో ఈ నెల 24న ఒక్క రోజే 22 మంది హత్యకు గురయ్యారు. అందుకు కారణం.. ప్రస్తుతం ఆ జైల్లో శిక్షను అనుభవిస్తున్న ముఠా నాయకుల ఆదేశాలు, వ్యూహాల ప్రకారమే బయట నగరంలో హత్యలు జరగుతున్నాయని.. ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బ్యూక్లే భావించాడు. దాంతో అక్కడి ఇజాల్కోలోని జైల్లో 24 గంటల పాటు కఠినంగా లాక్డౌన్ను అమలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
కొన్నేళ్ల క్రితం వరకు ఎల్ సాల్విడార్లో వీధి ముఠాల మధ్య కుమ్ములాటలు బాగా జరిగేవి. వాటిని మరాస్లని పిలిచేవారు. ఆ కుమ్ములాటల్లో పదుల సంఖ్యలో బలైపోయేవారు. అయితే ప్రస్తుతం ఉన్న దేశాధ్యక్షుడు నయీబ్ వచ్చాక పరిస్థితి మారింది. . కొన్ని నెలలుగా ఒక్క హత్య కూడా జరగలేదు. కానీ ఇటీవల ఒకే రోజు 22 మందిని మర్డర్ చేయడం కలకలం రేపింది. దీంతో జైల్లో లాక్డౌన్కు నిర్ణయం తీసుకున్నారు. ఆయన దేశ అధ్యక్షుడిగా గత జూన్ నెలలో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇంత దారుణమైన హత్యలు జరగడం ఇదే మొదటి సారి. దాంతో దానికి కారణమైన ఖైదీలకు లాక్ డౌన్ తప్పనిసరి చేశారు. జైల్లో ఖైదీలెవరూ ఒకరికొకరు మాట్లాడకుండా.. అందరిని ఒకే చోట ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా నిర్బంధించారు. అయితే కరోనా దృష్ట్యా ఇప్పటికే ఆ దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా కోసం దేశంలో సామాజిక దూరం పాటిస్తుంటే.. జైల్లో మాత్రం అందరినీ ఒకే చోట ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.