కొవిడ్-19 మహమ్మారి దేశంలో ప్రజల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రస్తుతమ దేశంలో కరోనా కేసులు 30 వేలు దాటాయి. మంగళవారం 1,825 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 31,358కి చేరింది. మరణాలు వెయ్యికి దగ్గరవుతున్నాయి. ఇప్పటిదాకా 977 మంది చనిపోగా, ఒక్కరోజు 38 మంది కరోనాకు బలయ్యారు. 22,766 యాక్టివ్ కేసులున్నాయి. ఇలాంటి దుర్వార్తల తరునంలో...ఓ గుడ్ న్యూస్ వినిపించింది. అదే రోగుల డిశ్చార్జి. మంగళవారం ఒక్కరోజే వివిధ ఆస్పత్రుల నుంచి 478 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా 7,615 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇక రాష్ట్రాల వారీగా చూస్తే...మహారాష్ట్రలో కేసులు 9 వేలు దాటాయి. మొత్తంగా అక్కడ 9,315 మంది కరోనా బారిన పడగా, 369 మంది చనిపోయారు. ఆ తర్వాత గుజరాత్లో 3,774 మందికి కరోనా సోకగా, 181 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడిన వాళ్ల సంఖ్య 31,06,598కి చేరింది. 2,14,642 మంది చనిపోగా, 9,44,593 మంది కోలుకున్నారు. అమెరికాలో ఎక్కువగా 10,22,259 మందికి కరోనా సోకింది. 57,862 మంది చనిపోయారు.
ఇదిలా ఉండగా, కరోనా రక్కసి కారణంగా గత 40 రోజుల నుంచి దేశంలో జనజీవనం స్తంభించిపోయింది. వ్యాపార కార్యకలాపాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో దేశంలో ఆర్థిక వనరులకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో 1.5 బిలియన్ డాలర్ల రుణం కావాలంటూ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ)కు భారత్ దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తు పరిశీలించిన ఏడీబీ రుణం మంజూరుకు ఆమోదం తెలిపింది. కాగా, భారత్ ఈ నిధులను కరోనా బాధితులకు వైద్య సేవలు అందిచడానికి, కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు ఆర్థిక సాయం చేయడానికి, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకూలీలకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించడానికి వినియోగించనుంది.