దేశంలో ఇప్పుడు కరోనా పంజా అన్నిచోట్లా విసురుతుంది. మొన్నటి వరకు సామాన్య ప్రజలకే అనుకుంటే.. వారిని రక్షించే డాక్లర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులను వదలడం లేదు. తాజాగా దేశాన్ని రక్షించే సైనికులకు ఈ కరోనా ముప్పు వాటిల్లుతుంది. తాజాగా దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రజలు కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోకూడదని విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు వైరస్ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రిలో చేరిన 55 ఏళ్ల సీఆర్పీఎఫ్ ఎస్ఐ మహ్మద్ ఇక్రం హుసేన్ మరణించాడు.. ఇక, 31వ సీఆర్పీఎఫ్ బెటాలియన్లో మరో 45 మందికి కూడా కరోనా పాజిటివ్గా వచ్చింది.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర సంతాపం తెలిపారు. సీఆర్ పీఎఫ్ బెటాలియన్ లో కరోనా వైరస్ ప్రబలకుండా అన్నిరకాల ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రమంత్రి డైరెక్టర్ జనరల్ ను ఆదేశించారు. దీంతో బెటాలియన్ కు సీలు వేశారు. కరోనా బారిని పడిన వారందరినీ క్వారంటైన్ కోసం ఆసుపత్రులకు తరలించారు. ఈ బెటాలియన్లో 1100 మంది జవాన్ల వరకు ఉండగా.. మరో 257 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా, వారి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఘటనతో సీఆర్ పీఎఫ్ జవాన్లను క్వారంటైన్ కు తరలించారు.
సీఆర్ పీఎఫ్ జవాన్లకు మాస్క్ లు, గ్లోవ్స్, శానిటైజర్లు అందించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఇప్పటివరకు 3314 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 1078 మంది కోలుకున్నారు, 54 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా వల్ల మరణించిన వారు ఇటీవల ఢిల్లీ ముజాహిద్దీన్ మర్కజ్ ప్రార్ధన సమావేశంలో పాల్గొన్నవారే అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ కొనసాగుతుంది.