అమెరికాలో ఉన్న వారి దృష్టి ఇప్పుడు సొంత గడ్డపై ఉంది. అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగుల భవిష్యత్ కలలపై కరోనా నీళ్లు చల్లింది. జూన్ చివరి నాటికి దాదాపు 2 లక్షల మంది హెచ్1బీ వీసాదారులు చట్టబద్ధంగా ఆ దేశంలో నివసించే హక్కును కోల్పోనున్నారు. గతంలో అమెరికా గురించి డబ్బా కొట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్పందించడం లేదని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
సుమారు 2,50,000 మంది ఉద్యోగులు అమెరికాలో గ్రీన్కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో దాదాపు 2 లక్షల మంది హెచ్1బీ వీసాదారులకు ఈ జూన్తో గడువు ముగియబోతోంది. నివాస హోదా కోరని మరో వేలాది మంది కూడా స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో అక్కడ ఉండే పరిస్థితులు లేక, స్వస్థలాలకు వెళ్లే మార్గం లేక వారు నరకయాతన అనుభవిస్తున్నారు. హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న వారిలో భారతీయులే అత్యధికం. దీంతో మనవారిపై ఈ ప్రభావం భారీగానే పడనుంది. ఈ నేపథ్యంలో అటు అమెరికాలో ఉండలేక, ఇటు భారత్కు వచ్చే దారిలేక వారు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. కరోనా కారణంగా విదేశీ రాకపోకలను భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.
అమెరికాలో గత 2 నెలల్లో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే స్థానికులతో పోలిస్తే విదేశీ ఉద్యోగులు మరింత సంకట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు, కంపెనీలు వారిని వేతనం లేని సెలవుపై పంపడం, వేతనాన్ని తగ్గించడం లేదా వర్క్ ఫ్రం హోమ్కు అనుమతించడం వంటివి వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయి. ఈ విధంగానూ వారికి వీసా ముప్పు ఉంది. ఉద్యోగం కోల్పోయిన హెచ్1బీ వీసాదారులు 60 రోజుల్లో మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వేరే వీసాకు మారడం లేదా దేశాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అయితే,ఇంత దారుణమైన పరిస్థితులు సంభవిస్తున్న తరుణంలో అమెరికాలో ఉన్న తెలుగువారందరూ తన వల్లే అని ప్రచారం చేసుకునే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ సమయంలో తన వంతుగా సహాయం చేసేందుకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.