కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ గడువు ముగిసే సమయం సమీపిస్తోంది. అందరి చూపు మే 3 తర్వాతి పరిస్థితులపైనే ఉంది. లాక్ డౌన్ పొడిగించకుండా ఉంటే నియంత్రణలు ఉపసంహరించే ప్రక్రియ 3వ తేదీ తర్వాత మొదలవుతుంది. అయితే, ఎక్కడ ముందుగా సడలింపు ఇస్తారనే ఆసక్తి నెలకొంది. సడలింపులు ముందుగు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయని ఒక విశ్లేషణలో తేలింది. ఎందుకంటే కరోనా బారిన పడకుండా ఉన్న జిల్లాల్లో అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి కాబట్టి. ఈ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారం. పైగా వలస కార్మికులు తక్కువగా ఉండే ప్రాంతం. ఈ అంశాలు లాక్ డౌన్ ఎత్తివేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
ఏప్రిల్ 15న ప్రభుత్వం 170 జిల్లాలను కరోనా హాట్స్పాట్లుగా గుర్తించింది. అంటే కరోనా విస్తరించింది ఎక్కువగా ఈ జిల్లాల్లోనే అన్నమాట. మరో 207 జిల్లాలను హాట్స్పాట్ లేని జిల్లాలుగా వర్గీకరించింది. అంటే ఆ జిల్లాల్లో పరిమిత సంఖ్యలో కరోనా వ్యాపించిందన్నమాట. ఈ రెండింటిని మినహాయిస్తే ఇక దేశంలోని 731 జిల్లాల్లో కరోనా బారిన పడకుండా ఉన్న300కు పైగా జిల్లాలు మిగులుతాయి. వీటిని ఇన్ఫెక్షన్లు లేని లేదా గ్రీన్ జోన్లుగా గుర్తించారు. ఈ గ్రీన్ జోన్లు సామాజిక దూరం నియమాల్ని పాటిస్తూ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తాయని సోమవారం నాటి సీఎంల వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు.
రెడ్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతాయని, ప్రభావం అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయని దాని అర్థం. ఇక మిగిలినవి గ్రీన్ జోన్లు. అవి నిజంగా గ్రీన్ జోన్లే. అంటే ఆర్థికంగా అవి హరితావరణాలే. అంతిమంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే లాక్ డౌన్ సడలింపులు అత్యధికంగా ఉంటాయని తెలుస్తుంది. త్వరలో ఈ మేరకు ప్రకటన వెలువడనుంది.