ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న వేళ కరోనా వైరస్ ప్రభావంతో అనూహ్యంగా ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడకుండా ఉండి ఉంటే ఆ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించేది. అనంతరం ఇక్కడ రాజకీయ పరిణామాలు మరింత వేగంగా మారిపోయేవి. ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి పలువురు కీలక నేతలు కట్టేవారు... ఇదిలా ఉంటే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. గత ఎన్నికలకు ముందు జనసేన లో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేసిన ఆయనకు ఏకంగా మూడు లక్షల ఓట్లు వచ్చాయి.
ఇక ఇప్పుడు జేడీ మనస్సు మళ్లీ విశాఖపట్నం మీదే ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను మరో సారి ఎంపీగానే పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ పరోక్షంగా తేల్చి చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ చేస్తోన్న మంచి పనులను మెచ్చుకోవడం మినహా బీజేపీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పిన ఆయన వైసీపీ రాజకీయ పార్టీగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీని తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చేరే అవకాశాన్ని మాత్రం కొట్టి పడేయలేదు.
వైసీపీలో చేరాల్సి వస్తే తాను ముందే చెప్పి చేరతానన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇక వైసీపీలోకి వస్తే ఆయన విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్టు ఆయన వ్యాఖ్యలు చెప్పకనే చెపుతున్నాయన్న చర్చలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే జగన్పై జేడీ గతంలో కావాలనే కేసులు పెట్టారన్న అపవాదు ఎదుర్కోన్నారు. అప్పట్లో వైసీపీ వాళ్లు కూడా జేడీపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇటు వైసీపీ కేడర్ పై కూడా జేడీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. మరి ఈ నేపథ్యంలో జేడీ వైసీపీ ఎంట్రీని వైసీపీ కేడర్ స్వాగతిస్తుందా ? జగన్ ఒప్పుకుంటారా ? అన్నది కూడా కాలమే నిర్ణయించాలి.