తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డేసేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంది. ఓ వైపు మీడియా ముఖంగా ముఖ్య‌మంత్రిని టార్గెట్ చేస్తున్న హ‌స్తం పార్టీ దీంతో పాటుగా రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన వ్య‌వ‌స్థ‌ల‌ను సైతం ఉప‌యోగించుకుంటోంది. ఈ క్ర‌మంలో తాజాగా గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ నేత‌లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నేతలు రాజ్ భ‌వన్‌లో గ‌వర్న‌ర్‌ను క‌లిసి క‌రోనా నివార‌ణ చ‌ర్య‌లు, రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. భేటీ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ, కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదో గవర్నర్ తో సుదీర్ఘంగా చర్చించామ‌న్నారు.

 


తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలు కూడా ఎక్కువ కరోనా ప‌రీక్ష‌లు చేస్తున్నాయ‌ని కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప‌రీక్ష‌లు చేయడం లేదని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి వైఖరి అశాస్త్రీయంగా ఉందని, ఏక పక్ష ధోరణితో ప్రభుత్వ పెద్దలు వెళ్తున్నారని తెలిపారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఎన్ని పరీక్షలు చేస్తున్నారో చెప్పాలని తెలంగాణ కరోనా ఫ్రీ కావాలని కోరుకుంటున్నామ‌ని తెలిపారు ఉత్త‌మ్. తెలంగాణలో మరణాలు చూపెట్టడం లేదని చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు ఎందుకు ఇచ్చారని ప్ర‌శ్నించారు. టెస్టింగ్ సామర్థ్యము ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు వినియోగించుకోవడం లేదని కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. 

 

క‌రోనా స‌మ‌యంలో ప్రతి బీపీఎల్ కుటుంబానికి 5 వేల రూపాయలు ఇవ్వాలని కోరామ‌ని కాంగ్రెస్ నేత‌లు తెలిపారు. నిరుపేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేసిన నేత‌లు గవర్నర్‌కు ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ రేషన్ బియ్యం చూపించామన్నారు. ఎంత మంది వలస కూలీలు ఉన్నారో ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవని..వలస కూలీలు వెళ్ళిపోతే … తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందన్నారు. వలస కూలీలకు సరైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు. మార్చి 26న అర్హుల‌కు కేజీ కంది పప్పు ఇస్తామని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారని… కానీ ఇప్పటి వరకు కంది పప్పు ఇవ్వలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: