ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న రాష్ట్రంలో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1650కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 33 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. తాజాగా ఏపీ ప్రభుత్వం రెడ్ జోన్లకు సంబంధించి స్పష్టత ఇచ్చింది. 
 
సీఎం జగన్ రెడ్ జోన్ల విషయంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు నుంచి రెడ్ జోన్లలో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. రెడ్ జోన్లలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లటానికి వీలు లేదు. మీడియాకు సైతం ఈ ప్రాంతాల్లోకి అనుమతులు లేవు. ఈ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు, మెడికల్ దుకాణాలకు కూడా అనుమతి లేదు. ప్రభుత్వమే వీరికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తుంది. 
 
సరైన ధ్రువపత్రాలు ఉంటే మాత్రమే అత్యవసరాలకు అనుమతి ఇస్తారు. రెడ్ జోన్లలో బ్యాంకులు, ఏటీఎంలు పని చేయవు. పార్కులు, కమ్యూనిటీ ఏరియాలపై కూడా నిషేధం కొనసాగుతుంది. రెడ్ జోన్లలోని ఏరియాలను ఇతరులు రావడానికి కూడా అనుమతి లేదు. పోలీసులు ఎవరైనా నిబంధనలను మొదటిసారి ఉల్లంఘిస్తే వారికి హెచ్చరికలు జారీ చేస్తారు. రెండోసారి కూడా ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేస్తారు. 
 
మరోవైపు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలలో అధిక సంఖ్య కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రభుత్వం ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మూడు జిల్లాలలో కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం నిన్న ఒక్కరోజే 10,000కు పైగా పరీక్షలు నిర్వహించింది. ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా అతి త్వరలో కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.       

మరింత సమాచారం తెలుసుకోండి: