ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ లాక్ డౌన్ ను ఈ నెల 17వరకు పొడిగించిన విషయం తెలిసిందే.అలాగే అందులో భాగంగా పలు సడలింపులు ఇచ్చింది. అయితే అందులో ప్రధానమైన మద్యం అమ్మకంతో పాటు మరే దానికి ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం అనుమతినివ్వలేదు.
అయితే కేంద్రం పొడిగించిన దాని కంటే మరో 12రోజులు లాక్ డౌన్ పొడిగించి ఈ నెల 29 వరకు పొడిగించింది. అలాగే విద్యార్థుల పరీక్షలు మరియు వివిధ రకాల షాప్ లు తెరవడం పై అన్నీ సూచనలు ఇచ్చారు.
మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 9.30గంటల వరకు కొనసాగింది. మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ చేశారు. సమావేశం ముగిసిన వెంటనే రాత్రి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా బులెటిన్ విడుదల చేశారు. తాజాగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని - వీటితో కలిపి 1096కు చేరాయని తెలిపారు. 43 మంది డిశ్చార్జయ్యారని తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 439 అని వెల్లడించారు.
ఆయా జోన్లలో ఏఏ కార్యకలాపాలకు సడలింపులు ఇవ్వాలన్న అంశంపై కేంద్రం మార్గదర్శకాలు నిర్దేశించిందని వివరించారు. అయితే కేసీఆర్ కేంద్రం నిర్దేశాలకు వ్యతిరేకంగా పలు సొంత నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా జోన్లతో సంబంధం లేకుండా యావత్ తెలంగాణ మొత్తం రాత్రి 7 గంటల తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం తెలిపారు.
కేంద్రం మార్గదర్శకాల్లో గ్రీన్ జోన్లలో 50 శాతం ప్రయాణికులతో బస్సులకు అనుమతించినా తెలంగాణలో మాత్రం తిరగవని స్పష్టం చేశారు. దీనిపై మే 15 తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆటోలకు కేవలం గ్రీన్ జోన్లోనే అనుమతి ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే, మున్సిపాలిటీల్లో రోజుకు 50 శాతం దుకాణాలు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు.
లాటరీ విధానం ద్వారా మున్సిపల్ ఛైర్మన్ ఆయా షాపులను ఎంపిక చేస్తారని నిర్దేశించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే షాపులు తెరిచేందుకు అనుమతి ఉంటుందని చెప్పారు.