ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు సదరు వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు.. ఆయన పరివారం ఇప్పుడు మాత్రం సదరు నిర్ణయానికి అనుకూలంగా ముందుకు రావడం రాజకీయంగా నే కాకుండా సాంకేతికంగా కూడా చర్చనీయాంశమైంది. మంగళవారం ఏపీ ప్రజలకు చంద్రబాబు లేఖ రాశారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో చంద్రబాబు హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఆయన ఏం చేయాలన్నా.. ఏం మాట్లాడలన్నా అక్కడి నుంచే చేస్తున్నారు. ఇప్పటికే గత వారం ప్రజలకు ఓ లేఖ రాసిన బాబు.. తాజాగా మరో లేఖ సంధించా రు. దీనిలోనే ఆయన సంచలన నిర్ణయం ప్రకటించి.. తాను అందుకు కూడా రెడీ అని చెప్పేశారు.
మద్యం కోసం వైన్స్ షాపుల వద్దకు వెళ్లొద్దని బాబు ప్రజలను కోరారు. సోమవారం నాడు లిక్కర్ షాపుల వద్ద పరిస్థితి చూశాక తీవ్ర ఆవేదన కలిగిందన్నారు. అందరికీ మాస్కులు ఇస్తానన్న ప్రభుత్వం.. కనీసం రెడ్జోన్లలోనూ మాస్కులు ఇవ్వలేకపోయిం దని ఎప్పటిలాగే.. జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసరాల కోసం 3 గంటల సమయం ఇచ్చిన ప్రభుత్వం.. మద్యం కోసం 8 గంటల సమయం ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. మెడికల్ షాప్కి వెళ్తే ప్రజలను కొట్టిన ప్రభుత్వం.. మద్యం షాప్కి మాత్రం స్వాగతిస్తుందని విమర్శలు గుప్పించారు.
ధరలు పెంచడం వల్ల మద్యపాన నిషేధం ఎక్కడైనా జరిగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్వి కుర్ర చేష్టలని ధ్వజమెత్తారు.
అదేసమయంలో క్వారంటైన్ సెంటర్ల వద్ద టెస్టులు చేశారా? అని ప్రశ్నించారు. కర్నూలులో కరోనా వ్యాప్తిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని ప్రశ్నించారు. కేంద్రం చెబితేనే తెరిచామంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఏపీకి తాను వస్తే క్వారంటైన్లో పెడతామంటున్న వైసీపీ నేతలు.. వారు మాత్రం యధేచ్చగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే ఆయన మరో కీలక విషయాన్ని చెప్పేశారు.
తాను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నానని, ఏపీకి రావాలని ఉందని చెప్పారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం తాను ఏపీలోకి ఎంటరైతే.. వెంటనే క్వారంటైన్ చేస్తామని చెబుతున్నారని, ఇప్పుడు తాను ఏపికి వచ్చి అవసరమైతే.. క్వారంటైన్లో ఉంటానని బాబు స్పష్టం చేసేశారు. ఇంత సాహసం ఎందుకు బాబూ.. అంటే.. ఏపీ ప్రజల బాగోగులు చూసేందుకేనని ఆయన చెబుతున్నారు. మరి ఎప్పుడు వస్తారో.. బాబు ముచ్చట ఎప్పుడు తీరుతుందో చూడాలి.