కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్త లాక్డౌన్ కొనసాగుతున్న నేపధ్యం లో రాష్ర్టాల ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి . లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తో , రాష్ర్టాలకు కాసింత వెసలుబాటు లభించినట్లయింది . ఆర్ధికంగా దివాళా తీస్తోన్న రాష్ర్టాలు, తమ ఖజానాను భర్తీ చేసుకునేందుకు సుదీర్ఘ విరామం తరువాత మద్యం దుకాణాలను ప్రారంభించాలని నిర్ణయించాయి . లాక్ డౌన్ సమయంలో నష్టపోయిన ఆదాయాన్ని తిరిగిరాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి .
దానిలో భాగంగా రాష్ర్టాలు మద్యం ధరలు పోటీపడి పెంచేందుకు ఆరాటపడ్డాయి . అంధ్రప్రదేశ్ , ఢిల్లీ లు అత్యధికంగా 75 ..70 శాతం మద్యం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి . అంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలుత 25 శాతం మాత్రమే మద్యం ధరలను పెంచుతున్నట్లు పేర్కొంది . అయితే మరుసటి రోజే మద్యం ధరల పెంపును సవరిస్తూ , అదనంగా మరో 50 శాతం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది . అంతకుమునుపే డిల్లీ ప్రభుత్వం 70 శాతం మద్యం ధరలను పెంచాలని నిర్ణయించింది . ఇక పశ్చిమ బెంగాల్ , కర్ణాటక రాష్ర్టాలు కూడా మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జరి చేశాయి .
ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యం ధరలను పెంచి , రాష్ట్ర ఖజానాకు నింపుకోవాలని నిర్ణయించింది . ఈ మేరకు సాధారణ మద్యం పై 11 శాతం , ఖరీదైన మద్యం పై 16 శాతం ధరలు పెంచుతూ అమ్మకాలకు అనుమతించింది . దీనితో పొరుగు రాష్ర్టాలతో పోలిస్తే , తెలంగాణతో మద్యం ధరలు తక్కువగానే పెంచడంతో మందుబాబులు బతుకు జీవుడా అనుకుంటున్నారు . మద్యం ధరలు ఎంతగా పెంచినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు ప్రారంభించకముందే మద్యం ప్రియులు బారులు తీరడం చూస్తుంటే , ధరల పెంపు నిర్ణయం తో నిమిత్తం లేకుండా తాగేందుకు పోటీపడుతున్నారు .