మహానగరం విశాఖలో దారుణమైన పరిస్థితి నెలకొంది. నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురంలోనిఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో భారీగా గ్యాస్ లీకైంది. 3 కి.మీ మేర ఈ గ్యాస్ వ్యాపించింది. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ఇప్పటి వరకూ తెలిసిన సమాచారం ప్రకారం.. ముగ్గురు చనిపోయినట్టు తెలిసింది.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. జనం ఇళ్లలోనే ఉండిపోవడం వల్ల ఎంత మంది ప్రమాదానికి గురయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. దాదాపు 200 మందికి పైగా అస్వస్థతకు గరైనట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సైరన్లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.