విశాఖపట్నంలోని గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది ఈ ఘటన. ఎంతోమందిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. తెల్లవారుజామున నగరం నిద్రపోతున్న వేళ ప్రమాదవశాత్తు ఎల్జి పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ నుంచి ప్రమాదకరమైన విష వాయువు వెలువడటం... ఏకంగా చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకు ఈ విష వాయువు వ్యాప్తి చెందడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విష వాయువులు పీల్చుకున్నప్పటి నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం... అంతేకాకుండా దద్దుర్లు నోటి నురగలు కక్కుతూ అపస్మారక స్థితిలోకి వెళ్తుండటంలాంటివి జరిగిపోయాయి.
అధికారులు హుటాహుటిన స్పందించి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ప్రజలందరినీ అంబులెన్స్లో కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంత మంది ప్రజలు ఏకంగా నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తలుపులు బద్దలు కొట్టి మరీ అధికారులు ప్రజలను ఆస్పత్రికి తరలించారు. ఇక విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన ఏకంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ వరకు వెళ్ళినది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ గ్యాస్ లీకేజి ఘటన పై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలోని గ్యాస్ లీకేజీ ఘటన పై స్పందిస్తూ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి విశాఖపట్నంలో పరిస్థితి ఎలా ఉండి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... అనే దానిపై చర్చలు జరిపారు. ఇక ఈ సమావేశానికి యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ కి సంబంధించిన పలువురు ముఖ్య అధికారులు హాజరవ్వగా... వారితో దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ ఘటన విషయంలో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.