కరోనా వైరస్ ప్రభావానికి గురి కాని రంగం అంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్క విభాగంలోనూ కరోనా దెబ్బ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు కరోనా అటు లాక్డౌన్ వల్ల భారత దేశంలో స్మార్ట్ఫోన్
అమ్మకాలు అసలు జరగడం లేదట. 2020 సంవత్సరం ప్రారంభంలో ఫోన్ల అమ్మకాలు బాగానే సాగాయి కానీ ఆ తర్వాత మన దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 500 మార్క్ను దాటడంతో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దీంతో స్మార్ట్ఫోన్ల డిమాండ్, సరఫరాలో అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం టాప్ బ్రాండ్లు కూడా ఒడదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి నిపుణులు ఓ సూచన చేస్తున్నారు.
కరోనా వైరస్ మన దేశంలో తన ప్రతాపం చూపకముందు రాకముందు స్మార్ట్ఫోన్ మార్కెట్ బాగానే ఉంది. అయితే, 5 జీ ఫోన్లు వస్తుండటంతో దాని ప్రభావం కూడా 4జీ స్మార్ట్ఫోన్లపై పడింది. ఇదే సమయంలో లాక్ డౌన్ ప్రకటించడం వల్ల మొబైళ్ల సరఫరా, డిమాండ్ రెండూ తగ్గిపోవడంతో పరిశ్రమ రెండవ త్రైమాసికంలో(ఏప్రిల్-జూన్ కాలం)లో గరిష్ట నష్టాన్నికూడగట్టుకున్నాయి. సీఎంఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇండియా ముబైల్ మార్కెట్ రివ్యూ రిపోర్టు క్యూ1 2020 ప్రకారం భారతదేశంలో మొత్తం స్మార్ట్ఫోన్ల ఎగుమతి కేవలం నాలుగుశాతం పెరిగింది. ఇప్పుడు కోల్పోయిన మార్కెట్ను తిరిగి పండగల సీజన్లో పొందవచ్చన్న ఆశాభావాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. క్యూ1 2020లో షియోమి(30శాతం), వివో (17)శాతం, శామ్సంగ్(16శాతం) అమ్మకాలు జరిపి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. రియల్మీ, ఐక్యూ కంపెనీలు 5జీ స్మార్ట్ఫోన్లు విడుదల చేశాయి. దీనిలో రియల్మీ ఎక్స్ 50 ప్రో 5జీ ఫోను ఎక్కువగా అమ్ముడుపోయింది.
కాగా, కొత్త మొబైల్ ఫోన్లు కొనాలనుకునే వారు కొద్ది కాలం వేచి చూడటం ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు. 5జీ ఫోన్లకు ఆదరణ పెరుగుతున్నందున వినియోగదారులు ఇప్పుడు 4జీ కొనడం కంటే 5జీ కొనుగోలు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. తద్వారా అత్యుత్తమ సేవలు తమ సంతం చేసుకోవచ్చునని పేర్కొంటున్నారు. అదే సమయంలో పండుగల సమయంలో మొబైల్ ఫోన్ల అమ్మకం కోసం కంపెనీలు ఆఫర్లు ప్రకటించవచ్చునని కాబట్టి అప్పుడు కొనుగోలు చేయడం వినియోగదారుల తెలివైన నిర్ణయం అవుతుందని విశ్లేషిస్తున్నారు.