దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు వ్యాపార, వాణిజ్య సేవలు స్తంభించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కే పరిమితమైన మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయి. కేంద్రం మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తున్నా ఆర్థికాభివృద్ధి కోసం కేంద్రం మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయి. అయితే తాజాగా ఒక మహిళ వైన్ షాప్ దగ్గర మందుబాబులను చితకబాదింది. ఆ మహిళ లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారందరికీ సొంత డబ్బులతో ఆహారం అందజేసి ఆకలి తీర్చింది. కానీ వారు వైన్ షాప్ ముందు మద్యం కోసం నిల్చొని ఆమెకు కనిపించారు. ఎంతో కష్టపడి వాళ్లకు ఆహారం అందిస్తోంటే వాళ్లు మద్యం కోసం డబ్బులు వృథా చేయడం ఆమెకు నచ్చలేదు. 
 
వెంటనే మహిళ లాఠీ పట్టుకుని వైన్ షాప్స్ దగ్గర మందుబాబులను చితకబాదుతూ వారు మద్యం కొనుగోలు చేయకుండా చేసింది. విషయం తెలిసిన పోలీసులు సదరు మహిళను అడ్డుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు మహిళను సమర్థిస్తుంటే... మరికొందరు ఆ మహిళపై విమర్శలు చేస్తున్నారు. 


 
మరోవైపు దేశవ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరుతున్నారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర మందుబాబులు మద్యం కోసం నిలాబడుతూ ఉండటం గమనార్హం. పలు ప్రాంతాల్లో మహిళలు సైతం మద్యం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏపీలో పలు ప్రాంతాల్లో గొడుగులతో మందుబాబులు క్యూ లైన్లలో నిలబడుతుంటే... మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆధార్ కార్డులో అడ్రస్ ను పరిశీలించి మద్యం సరఫరా చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: