సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు గుడ్ న్యూస్. కరోనా కష్టాల సమయంలో అందుబాటులోకి వచ్చని వెసులుబాటు విషయంలో మరింత తీపి కబురు. లాక్ డౌన్ ఇబ్బందులకు దూరమయ్యేలా వర్క్ ఫ్రం హోం సౌలభ్యం సౌలభ్యం కొనసాగుతుండగా...ఈ విషయంలో మరింత తీపికబురు. కరోనా మహమ్మారి కట్టడికి వర్క్ ఫ్రం హోం పద్ధతిని కొనసాగించాలని టెక్ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ దిగ్గజాలు ఇప్పటికే తమ ఉద్యోగులకు తెలియజేశాయి.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో, అంతర్జాతీయంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని కొనసాగించాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకూ తమ ఉద్యోగులలో చాలామంది ఇంటి నుంచే పని చేయడానికి అనుమతి ఇస్తామని ప్రముఖ టెక్ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్ తెలిపాయి. జులై 6 వరకు చాలా వరకు తమ కంపెనీ కార్యాలయాలను తెరిచే ఆలోచనలేదని ఫేస్బుక్ స్పష్టం చేసింది. పబ్లిక్ హెల్త్ డేటా, ప్రభుత్వ మార్గదర్శకాలు, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఆఫీసులను ఓపెన్ చేయాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. 2020 చివరి వరకూ ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాల్సి ఉంటుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఎంప్లాయిస్తో మీటింగ్లో ధ్రువీకరించారు. గూగుల్ మొదట జూన్ 1 వరకూ వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పుడు దానిని మరో ఏడు నెలలు పొడిగించింది.
కాగా, మనదేశంలోనూ కీలక నిర్ణయం వెలువడిన సంగతి తెలిసిందే. కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్ ఢిల్లీ నుంచి అన్ని రాష్ర్టాల ఐటీ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, ఐటీ పరిశ్రమపై కొవిడ్-19 ప్రభావం, కొత్త టెక్నాలజీ వినియోగం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. కొవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఇళ్ల నుంచి విధులు (వర్క్ ఫ్రం హోం) నిర్వర్తించేలా ఐటీ, బీపీవో సంస్థల సిబ్బందికి గతంలో కల్పించిన వెసులుబాటును జూలై 31 వరకు పొడిగిస్తున్నట్టు రవిశంకర్ప్రసాద్ వెల్లడించారు.