ఏపీ సీఎం జగన్ ఆంధ్రాప్రజలకు మరో శుభవార్త చెప్పారు. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా చోట్ల చిన్న ఆసుపత్రులు కూడా మూతబడ్డాయి. ప్రముఖ ఆసుపత్రుల్లో కరోనా కేసులే ప్రధానంగా చూస్తున్నారు. దీంతో సాధారణ జబ్బులు ఉన్నవారు.. ఇబ్బందిపడుతున్నారు. అందుకే జగన్ సర్కారు టెలీ మెడిసిన్ విధానాన్ని తీసుకొచ్చింది.
ఈ విధానం ప్రజలకు ఉపయోగంగా ఉంది. అయితే.. ఈ విధానంపై సమీక్షించిన జగన్.. వైయస్ఆర్ టెలీ మెడిసిన్ విధానం మరింత సక్సెస్ఫుల్గా కొనసాగాలని అధికారులకు చెప్పారు. రోగులుఫోన్ చేసిన 24 గంటల్లోనే పూర్తిగా వైద్య సేవలు అందాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు కాకుండా టెలీ మెడిసిన్కు ఇతర కేసులు ఎన్ని వస్తున్నాయో వివరాలు ఇవ్వాలని, డాక్టర్లు ప్రిస్కిప్షన్ ఇవ్వగానే 24 గంటల్లోగా మందులు అందేలా చూడాలని అధికారులను జగన్ ఆదేశించారు.
టెలీ మెడిసిన్ తో పాటు పీహెచ్సీల్లో కూడా సౌకర్యాలు మెరుగుపరచాలని జగన్ ఆదేశించారు. పీహెచ్ సీల్లో తప్పనిసరిగా బైక్లు, థర్మో బ్యాగ్లు ఉండాలని.. వీటిని వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని జగన్ సూచించారు. కరోనా పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని... ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు కూడా ఇందులో భాగమని సీఎం జగన్ సూచించారు.
అదే సమయంలో కరోనా నియంత్రణ చర్యలపైనా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారందరికీ కరోనా పరీక్షలు పూర్తి చేశామని అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారి రాక దేశంలో ప్రారంభమైందని, గల్ఫ్ నుంచే కాకుండా యూకే, యూఎస్ నుంచి కూడా కొంతమంది రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించారు. వారందరికీ క్వారంటైన్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని జగన్ వారికి సూచించారు.