ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న కారణాలతోనే  మనుషుల ప్రాణాలు తీస్తున్నారు సాటి మనుషులు. ముఖ్యంగా క్షణికావేశంలో ప్రాణాలను  తీస్తూ  ఆ తర్వాత జైలు పాలు అవుతున్నారు.  ఇక మందుబాబుల పరిస్థితి దారుణం గా మారిపోతుంది. కొంతమంది మందుబాబులు మద్యం తాగిన తర్వాత విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీస్తుంటే ఇంకొంత మంది మద్యానికి డబ్బు ఇవ్వడం లేదనే కారణంతో ప్రాణాలు తీస్తున్నారు. సొంత వారు అని కూడా చూడకుండా కాటికి పంపించేస్తున్నారు. చివరికి కటకటాలపాలవుతున్నారు. 

 

 

 తాజాగా ఇక్కడ ఇలాంటి ఓ దుర్ఘటన చోటు చేసుకుంది... మద్యానికి బానిసైన కొడుకు తన తల్లిని మద్యం కోసం డబ్బులు అడిగాడు. ఇక తల్లి డబ్బులు ఇవ్వలేదు అన్న కోపం తో ఏకంగా తల్లిని హతమార్చారు ఆ కిరాతకుడు. కనీసం జన్మనిచ్చింది అన్న జాలి దయ లేకుండా అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతో కొడుకు తల్లిని  హతమార్చిన ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్  పేట్ మండలం దుద్యాలలో చోటుచేసుకుంది. దుద్యాల కు చెందిన అశోక్ మేస్త్రి పని చేసుకుంటూ భార్యాపిల్లలు తల్లిని పోషించుకునే వాడు. 

 

 

 అయితే గత కొంత కాలం నుంచి తాగుడుకు బానిసయ్యాడు అశోక్ అనే వ్యక్తి. ఇక లాక్ డౌన్  సమయం కావడంతో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో మద్యందుకాణాలు తెరిచుకోవడంతో... మద్యం కొనుగోలు చేయడానికి డబ్బులు కావాలి అంటూ తల్లి అంజిలమ్మ (60) ని అడిగాడు. కానీ ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన అశోక్ తన తల్లిని గొంతునులిమి చంపేశాడు. ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: