విశాఖలో పెను విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. మంత్రులతో వాగ్వాదానికి దిగారు. డీజీపీని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదానికి కారణమైన కంపెనీపై ఏం చర్యలు తీసుకుంటున్నారో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు స్థానికులు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ను అక్కడి నుంచి తరలించాలని నినాదాలు చేస్తూ పరిశ్రమ వద్ద ధర్నాకు దిగారు స్థానికులు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్యాస్ లీకేజీ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలతో పరిశ్రమ గేటు వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. స్థానికుల ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గ్యాస్ లీకైన ప్రదేశాన్ని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు ఒక్కసారిగా పరిశ్రమలోకి దూసుకెళ్లారు. గేట్లు మూసివేసి పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆందోళనకారులు లెక్కచేయకుండా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో కొందరు మహిళలు డీజీపీ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు వలయంగా ఏర్పడి డీజీపీకి రక్షణ కల్పించారు. ఆందోళనకారులు పరిశ్రమలోకి చొచ్చుకురావడంతో డీజీపీ వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లారు. గ్యాస్లీకైన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు అతికష్టం మీద డీజీపీని అక్కడినుంచి పంపించారు.
మరోవైపు డీజీపీని అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఎల్జీ పాలిమర్స్ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్చేస్తూ శనివారం ఉదయం నుంచి పరిశ్రమ వద్ద ఆందోళన కొనసాగుతోంది. సంయమనం పాటించాలని స్థానికులకు పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు. పరిశ్రమ పరిసరాల్లో పరిస్థితిని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పర్యవేక్షిస్తున్నారు. ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చిన మంత్రులతో కూడా స్థానికులు వాగ్వాదానికి దిగారు.
తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలతో పరిశ్రమ వద్దే ఆందోళన కొనసాగిస్తామని ఐదు గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. నాయకులు ఎవరు వచ్చినా పరిశ్రమలోకి వచ్చి చూసి వెళ్లిపోతున్నారు తప్ప గ్రామాల్లోకి వచ్చి చూడటం లేదని వెంకటాపురం వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి రెండు రోజులవుతున్నా ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్యం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.
ఓ వైపు స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా.. పరిశ్రమకు సమీపంలోని వెంకటాపురం గ్రామస్థులు భారీగా తరలివస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యువకులను అరెస్టు చేసే క్రమంలో వారు ప్రతిఘటించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. సీఎం జగన్ తమ గ్రామంలోకి వచ్చి పరిస్థితిని పరిశీలించాలని కోరారు. ప్రమాద ఘటనపై పరిశ్రమ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలన్న స్థానికులు.. పరిశ్రమను తరలించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.