కరోనా సృష్టించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ కారణంగా అయితే, ఇబ్బందులు చెప్పలేనన్ని. ఇప్పుడు ఈ జాబితాలో ఇంకో షాకింగ్ వార్త చేరింది. అదే ఉప్పు. ఉప్పు కష్టాలు లాక్ డౌన్ వల్ల ఎదురు కావడం ఖాయమంటున్నారు. లాక్డౌన్ వల్ల ఈసారి ఉప్పు ప్రొడక్షన్ టార్గెట్ను చేరుకునే అవకాశాలు తక్కువ ఉన్నాయని తయారీదారులు చెబుతున్నారు. లాక్డౌన్ వల్లే దీని ప్రొడక్షన్ తగ్గింది. లేబర్ కొరత, రవాణా లేకపోవడం, లాక్డౌన్ రూల్స్తో తయారీ ఆగిపోయింది. దీంతో ఊహించని సమస్యలు ఎదురు కానున్నాయి.
ఇండియన్ సాల్ట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఇస్మా) వివరాల ప్రకారం, మనదేశంలో ప్రతి ఏడాది 95 లక్షల టన్నుల ఉప్పు వాడుతారు. 110 లక్షల టన్నుల నుంచి 130 లక్షల టన్నులను పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారు. మరో 60 లక్షల టన్నులను విదేశాలకు ఎగుమతి చేస్తారు. పవర్ప్లాంటు, ఆయిల్ రిఫైనరీలు, సోలార్ ఫార్మా సూటికల్స్, రబ్బర్ కంపెనీలు, లెదర్ మాన్యుఫ్యాక్చరర్స్ తమ ప్రొడక్టుల తయారీకి ఉప్పును వాడతారు. ఇండియాలో తయారయ్యే ఉప్పులో గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వాటాయే 95 శాతం వరకు ఉంటుంది. మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్లోనూ కొందరు ఉప్పు రైతులు ఉన్నారు. వీళ్లంతా ఏటా దాదాపు 250 లక్షల టన్నుల వరకు ఉప్పును తయారు చేస్తారు.
సాధారణంగా ఏటా అక్టోబరు నుంచి జూన్ వరకు ఉప్పు ప్రొడక్షన్ జరుగుతుంది. మార్చి, ఏప్రిల్ నెలలో ప్రొడక్షన్ మరింత ఎక్కువ ఉంటుంది. గత 40 రోజుల నుంచి లేబర్ దొరక్కపోవడం, రవాణా సదుపాయం లేకపోవడం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతా నికి వెళ్లకుండా ఆంక్షలు ఉండటం వల్ల పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రొడక్షన్కు కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉందని, సరిపడినంత తయారు చేయగలమో లేదో తెలియదని ఇండియన్ సాల్ట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఇస్మా) ప్రెసిడెంట్ భరత్ రావల్ వివరించారు. ఈలోపు ప్రొడక్షన్ టార్గెట్ ను చేరుకోలేకపోతే ఉప్పుకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. వర్షాలు ఆలస్యంగా వస్తే మాత్రం ప్రొడక్షన్ సైకిల్ పెరుగుతుందని, ఎక్కువ మొత్తంలో తయారు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.