కరోనా మహమ్మారి కలకలం కొనసాగుతోంది. అన్ని ముఖ్యమైన దేశాలు ఈ మహమ్మారి బారిన పడి విలవిలలాడుతున్నాయి. ప్రపంచ పోలీస్ అని చెప్పుకొనే అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇదే సమయంలో కరోనా మహమ్మారి నుంచి చైనా పూర్తిగా కోలుకుంటున్న తరుణంలో మరోమారు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది.
కొత్తగా నమోదు అవుతున్న కేసులలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ఉండగా 11 జిలిన్ ప్రావిన్సుకు చెందిన వారు. ఏప్రిల్ 28 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,901కి చేరింది. ఈ వైరస్ ప్రభావంతో చైనాలో ఇప్పటివరకు 4633 మంది మరణించారు. కరోనా వైరస్ చైనాలో పుట్టినప్పటికీ, మొదట్లో ఎక్కువగా మరణాలు నమోదైనది మాత్రం ఇటలీలో. ప్రస్తుతం ఆ దేశంలో 2,18,268 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి వల్ల ఇప్పటివరకు 30,395 మరణించారు. యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో కరోనా కేసులు 2,15,260కి చేరాయి. ఇప్పటివరకు 31,587 మంది మృతి చెందారు.
కరోనా కేసుల రేసులో రష్యాలోని పరిణామాలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వరుసగా 10 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండటంతో ఆ దేశం కరోనా పాజిటివ్లు ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో ఐదో స్థానానికి చేరింది. రష్యాలో ఇప్పటివరకు 1,98,676 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో 1827 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 1,64,933 యాక్టివ్ కేసులు ఉండగా, 31916 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. స్పెయిన్లో కరోనా పాజిటివ్ కేసులు 2,63,783కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 26,478 మంది మరణించారు.