సున్నితమైన విషయాల్లో పాలకులు విజ్ఞతతో వ్యవహరించాలి. ఇప్పటికే ఆరుగాలం శ్రమిస్తూ వ్యవసాయంతో ఆందోళన చెందుతున్న రైతుల విషయంలో బీజేపీ పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నీటి వినియోగం విషయంలో మునుపెన్నడూ లేని ఆదేశాలు జారీ చేశారు. వరిసాగుపై హర్యానా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నిషేధం విధించింది. వరి సాగు చేస్తే ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధరను కల్పించమని తేల్చి చెప్పింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఓ రేంజ్లో ఆడుకుంది.
భూగర్భ జలమట్టం 35 మీటర్ల కన్నా తక్కువ ఉన్న గ్రామ పంచాయతీల్లో వరి విత్తడానికి వీలు లేదని, ఇక్కడ విత్తనాల సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ పథకంలో భాగమైన 24 బ్లాకుల్లో రైతుల జీవితాలు, వారి జీవనోపాధిపై ఎంతవరకు ప్రభావితం చేస్తుందనే దానిపై అధ్యయనం చేయనుంది. మొత్తం 26 బ్లాకుల్లో వరిసాగు పూర్తిగా నిలిపివేసి ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇతర పంటకు మారిన రైతులకు ఎకరానికి రూ.7000 ప్రోత్సాహకం వివిధ రూపాలలో ఇస్తామని తెలిపింది. ఎకరానికి 2వేల ప్రోత్సాహకం, ఉచిత హైబ్రీడ్ విత్తనాలు, పంట బీమా చెల్లిస్తామని హామి ఇస్తుంది. తాజా నిర్ణయంతో 1 లక్ష 37 వేల ఎకరాల్లో రైతులు వరి నుంచి మరో పంటకు మారాల్సి ఉంటుంది.
అయితే, ఈ నిర్ణయంపై హర్యానాలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ ప్రభుత్వం నిర్ణయం రైతుల జీవితాలు, జీవనోపాధి ప్రమాదంలో పడేస్తుందని మండిపడింది. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఈ ఉత్తర్వుతో 2.30 లక్షల ఎకరాల్లో వరిసాగుకు రైతులు దూరమౌతారని, ఈ పథకం విఫలమైతే అనేక మంది రైతుల తమ పోలాలను బీడు భూములుగా వదిలేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే పథకాలకు బదులు, తమ భూమిలో ఇష్టపడే పంటను పండించే హక్కును దూరం చేయడం న్యాయం కాదన్నారు.