రెండు నెలల పాటు బీభత్సమైన పరిస్థితి ఉంటుంది. అలా ఇలా కాకుండా ఊపేస్తుంది. ఎక్కడా కుదురుగా ఉండనీయదు, ఓ విధంగా చెప్పాలంటే విశ్వరూపమే చూపిస్తుంది. కరోనా మహమ్మారి భారత్ లో తన దూకుడును చూపించే ఆ రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇది దేశీయ వైధ్య నిపుణులే కాదు, అంతర్జాతీయ వైద్య నిపుణులు కూడా కచ్చితంగా చెబుతున్నారు. కరోనా మహమ్మారి నిజానికి మే నెలలోనే తన ప్రతాపం చూపించాలి. అయితే లాక్ డౌన్ పొడిగించడం వల్ల అది కాస్తా నెమ్మదించింది. ఇక రానున్న జూన్, జూలై నెలలు మాత్రం కరోనా నెలలేనని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా చెబుతున్నారు.
ఓ విధంగా చెప్పాలంటే భారత్ లో కరోనా పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది. ముందు మరింతగా దారుణమైన వాతావరణం ఉంటుంది అని ఆయన అంటున్నారు. దేశంలో కరోనా కేసులు ఇంతలా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని, వాటిలో ముఖ్యమైనది అధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం అని ఆయన చెబుతున్నారు. గతంలో రోజుకు నాలుగైదు వేల పరీక్షలు మాత్రమే జరిగితే ఇపుడు రోజుకు ఎనభై నుంచి తొంబై దాకా పరీక్షలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
దాని వల్ల కేసులు ముమ్మరంగా పెరుగుతున్నాయని అంటున్నారు. లాక్ డౌన్ కనుక ఎత్తివేస్తే ప్రజలు బాధ్యతగా మెలగాలని ఆయన కోరుతున్నారు. ముఖ్యంగా ముఖానికి మాస్క్ ని తప్పనిసరిగా ధరించడం. అదే విధంగా సామాజిక దూరం పాటించడం వంటివి ప్రజలు తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యతలుగా రణదీప్ గులేరియా చెప్పారు.
ఇది ఎక్కువగా ప్రజల బాధ్యతగా స్వీకరించాలని, కరోనా కట్టడి అన్నది ప్రజల చేతుల్లోనే ఉందని ఆయన చెబుతున్నారు. ప్రజలు పూర్తిగా సహకరిస్తే కరోనా మహమ్మారి చైన్ లింక్ తెగుతుందని, దాని వ్యాప్తి తగ్గిపోతుందని కూడా అంటున్నారు. కరోనా విషయంలో ప్రభుత్వాలు చేయాల్సినవి కూడా ఉన్నాయని ఆయన చెబుతూ హాట్ స్పాట్స్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన కఠినమైన చర్యలను కనుక చేపడితే ప్రజలకు కరోనా వైరస్ తీవ్రత మీద మరింత అవగాహన వస్తుందని ఆయన అన్నారు.
మొత్తం మీద చూసుకుంటే కరోనా వైరస్ అన్నది భారత్ కి తన తడాఖా చూపించే నెలలుగా జూన్, జూలై ఇపుడు భయపెడుతున్నాయి. మరి ఎలా కరొనాను కట్టడి చేయాలో చూడాలి.