ఏపీ సీఎం జగన్ ఈరోజు ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్ లో రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు జోరుగా సాగాల్సి ఉందని... స్థానిక సంస్థలకు నిధులు కావాలని మోదీని కోరారు. రాష్ట్రంలో తయారీ రంగం పూర్తిగా స్తంభించిపోయిందని... ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రతి పంటకూ ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిందని అన్నారు.
రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి పూర్తి అవరోధాలు తొలగిపోవాలని కోరారు. సరుకుల రవాణా సాధారణ స్థాయిలో జరిగితే మాత్రమే ఆర్థిక వ్యవస్థ మళ్లీ పునరుజ్జీవం పొందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజారవాణా రంగంమీద ఉన్న ఆంక్షలను తొలగించాలని... వలస కూలీల్లో, ఉద్యోగుల్లో భయం, ఆందోళన తొలగిపోవాలని అన్నారు. ప్రజారవాణాలో మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిచేయాలని... బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా చేయాలని చెప్పారు.
షాపింగ్ సెంటర్లు తెరుచుకునేందుకు అవకాశం ఇవ్వాలని.... స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కేంద్రం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని... ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి 16,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. వడ్డీలు లేని రుణాలు ఇవ్వాలని... దీర్ఘకాలిక చెల్లింపుల ప్రాతిపదికన రుణాలు ఇవ్వాలని సూచించారు.
ఆరోగ్య రంగానికి ఇచ్చే నిధులను ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకురావాలని అన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్లకు చేయూతనివ్వాలని కోరారు. అన్ని రాష్ట్రాల్లో హోల్సేల్ మార్కెట్లను తెరవాలని సేకరణలో ప్రస్తుతం ఉన్న పరిమితిని 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని పెంచాలని కోరారు. కరోనా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు బాగుంటే పేదలకు మేలు జరుగుతుందని అన్నారు. పౌరులంతా సాధారణ జీవితాలు గడపడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.