ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఇప్పటివరకు మాటల యుద్ధం చేసుకున్న వైసీపీ, టీడీపీ నేతలు ఇప్పుడు ప్రాసల యుద్ధంలోకి దిగారు. సరికొత్తగా విమర్సలు చేసుకునే విషయంలో ఇరు పార్టీల సెటైర్లు పీక్స్ కు వెళ్లాయి. రెండు పార్టీల నేతలకు సరికొత్త పేర్లు పెట్టుకుని విమర్శించుకుంటున్నారు.
మొదట వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ ప్రాసల యుద్ధం మొదలుపెట్టగా, తర్వాత టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ దీన్ని కొనసాగించారు. ముందు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ క్రింది వారిలో 'కరోనా రత్న' ఎవరు? అంటూ పోల్ పెట్టి, ఐదు ఆప్షన్స్ని ఇచ్చారు. 24 గంటల్లో మీ అభిప్రాయాలను చెప్పాలని అన్నారు.
ఆయన ఇచ్చిన ఆప్షన్స్ వచ్చి వరుసగా పెదనాయుడు, చిననాయుడు, మలమలకృష్ణరాముడు, దయనేని రమ, భజనా చౌ అంటూ పోస్ట్ చేశారు. ఇక ఈ పేర్లు ఎవరివో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరిని ఉద్దేశించి విజయసాయి మాట్లాడారో అర్థమైపోతుంది.
ఇక విజయసాయికి కౌంటర్ గా బుచ్చయ్య చౌదరీ కూడా ఓ పోస్ట్ పెట్టారు. ఈ క్రింది వారిలో కమిషన్ వసూలులో "పిరాన రత్న" ఎవరు? అడుగుతూ... జలగం, .కసాయి/ సీసాయి/విసాయి, గుడివాడ గోళి, తస్సదియ్య నత్తిబాబు, అంబలి రాంబా, పేరుకుపోయిన నెయ్యి అంటూ కొన్ని పేర్లు పెట్టారు. 24 గంటలు కాదు మీకు నచ్చిన టైం తీసుకోని చెప్పమంటూ బుచ్చయ్య కౌంటర్ ఇచ్చారు.
అయితే ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయసాయి పంచ్ మామూలుగా లేదని వైసీపీ కార్యకర్తలు అంటుంటే, బుచ్చయ్య తాత కౌంటర్ అదిరిపోయిందని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. కాకపోతే ఈ విధంగా రెండు పార్టీల నేతలని వెటకారంగా వేరే పేర్లు పెట్టి రాయడమనేది కాస్త ఎబ్బెట్టుగానే ఉన్నట్లు అనిపిస్తుంది.
ప్రజాజీవితంలో ఉన్నవారిని ఇలా దారుణంగా కించపరచడమనేది సమంజసం కాదేమో అని కొందరు న్యూట్రల్ వ్యక్తులు అంటున్నారు. మొత్తానికైతే ఏపీలో కొత్త ట్రెండ్ మొదలైనట్లే కనిపిస్తోంది. మరి ఈ ప్రాసల యుద్ధం ఎంతవరకు వెళుతుందో చూడాలి.