లాక్ డౌన్ సమయంలో ఆసక్తికరమైన, చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లాక్ డౌన్ వల్ల దేశం మొత్తం స్తంభించిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో పెట్రోల్, డీజిల్ వినియోగం సగానికి పైగా తగ్గిపోయింది. లాక్డౌన్ దెబ్బకు అంతర్జాతీయ చమురు ధరలు రెండు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. ఇదే సమయంలో లాక్ డౌన్ దెబ్బతో గత నెలలో పెట్రోల్, డీజిల్ వినియోగం భారీగా పడింది. ఏప్రిల్ నెలలో పెట్రోల్ సేల్స్ 60.43 శాతం తగ్గి 9.73 లక్షల టన్నులగా నమోదయ్యాయి. గత నెల మొదటి పదిహేను రోజుల్లో ఈ పతనం 64 శాతంగా ఉంది.
ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో తర్వాత పదిహేను రోజుల్లో పెట్రోల్ సేల్స్ కొంత పుంజుకున్నాయి. అదే విధంగా డీజిల్ వాడకం కూడా ఏప్రిల్ నెలలో భారీగా పడిపోయింది. లాక్డౌన్ దెబ్బతో ఫ్యాక్టరీలన్ని నిలిచిపోయి గత నెల మొదటి పదిహేను రోజుల్లో డీజిల్ వినియోగం 61 శాతం తగ్గింది. ఫ్యాక్టరీలు రీఓపెన్ అవ్వడంతో తర్వాత పదిహేను రోజుల్లో డీజిల్ వినియోగం కొంత పుంజుకుంది. మొత్తంగా ఏప్రిల్ నెలలో డీజిల్ సేల్స్ 55.6 శాతం పడిపోయి 32.5 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. ఎల్పీజీ సేల్స్ మాత్రం 12.2 శాతం పెరిగి 21.3 లక్షల టన్నులకు చేరుకుంది. అయితే, లాక్ డౌన్ ఎత్తివేస్తే త్వరలోనే అమ్మకాలు మునుపటి స్థితికి చేరుకుంటాయని ఆశిస్తున్నారు. పేదలకు వంట గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుండడంతో ఎల్పీజీ వినియోగం మాత్రం కొద్దిగా పెరిగింది.
ఇదిలాఉండగా, అంతర్జాతీయ చమురు ధరల తగ్గుదల వల్ల వచ్చే నష్టాలను తగ్గించుకోవడం కోసం ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని గత మార్చిలో పెంచింది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి పెంచింది. మార్చిలో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 3 రూపాయలు పెంచడం వల్ల ప్రభుత్వం సుమారు 39,000 కోట్ల రూపాయలు ఆర్జించింది. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పెట్రోల్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 2 రూపాయలు పెంచడంతో పాటు రోడ్ సెస్ను లీటరుకు 8 రూపాయలు పెంచారు. డీజిల్ విషయంలో ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 5 రూపాయలు మరియు రోడ్ సెస్ను లీటరుకు రూ .8 పెంచారు. దాంతో పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం మొత్తం లీటరుకు రూ 32.98కు, డీజిల్పై రూ 11.83కు పెరిగింది.