కరోనా కోరలు చాచిన వేళ ప్రతి ఒక్కరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఎక్కడి వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్డౌన్ని ప్రకటించాయి. దీంతో కాస్త కరోనాని కట్టడి చేయగలిగాము. లేదంటే ఈ పాటికి మరింత కేసులు ఎక్కువయి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల్లో కూడా రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కట్టడిని మరింత బలంగా చేస్తూ...ఎప్పటికప్పుడు లాక్డౌన్ని పొడిగించుకుంటూ వెళుతున్నారు. దీంతో అనుకోకుండా చాలా మంది వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వారు అనుకోని పరిస్థితుల్లో లాక్ అయిపోవలసి వచ్చింది. లాక్డౌన్ పొడిగించడంతో కొంత మంది ఏమి చేయలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు.
ఇలాంటి విచారకర ఘటన ఒకటి హైదరాబాద్లో చోటు చేసుకుంది. మణికొండలోని ల్యాంకో హిల్స్ పై అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వీరవల్లిక అనే యువతి 3 నెలల క్రిందట హైదరాబాద్ వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో ఇక్కడే ఉండిపోవలసి వచ్చింది. దీంతో ఇంటికొచ్చేస్తానని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తరుచూ ఆమె చెపుతూ ఉండేది. అయితే రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆమె క్షేమం కోరి రావొద్దని, లాక్డౌన్ పూర్తికాగానే రావాలని చెప్పేవారు.
దీంతో ఆ యువతి కుటుంబసభ్యులపై బెంగతో తరుచూ ఆవేదన చెందేది. లాక్డౌన్ పొడిగిస్తారన్న వార్తలతో మనస్తాపం చెందిన ఆమె బుధవారం ఉదయం మణికొండలో ఉన్న ల్యాంకో హిల్స్ 15వ అంతస్తు పై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు స్థానికుల నుంచి సమాచారాన్ని అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిద్దామని చూసేసరికే ఆమె అప్పటికే మరణించింది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ సమాచారాన్ని ఆమె తల్లిదండ్రులకు చేరవేశారు.