ఏపీ సీఎం జగన్ వాదనకు టీడీపీ ఎంపీ మద్దతు ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కరోనాతో కలిసి జీవించాల్సిందేనని వ్యాఖ్యలు చేశారు. అనంతరం కేసీఆర్, కేటీఆర్, ఇతర రాజకీయ నాయకులు సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ జగన్ చెప్పిందే కరెక్ట్ అని అన్నారు. గత కొన్ని రోజులుగా టీడీపీ జగన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తోంది. 
 
కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కరోనాతో కలిసి జీవనం సాగించక తప్పదని వ్యాఖ్యలు చేసింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీ ప్రసంగం గురించి స్పందించారు. ప్రధాని మోదీ తాను చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు. కరోనాతో కలిసి జీవించాల్సిందేనని పేర్కొని పరోక్షంగా జగన్ వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం జగన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తే సీఎం స్థాయి వ్యక్తి అలా ఎలా మాట్లాడుతారంటూ విమర్శలు చేశారు. 
 
మరోవైపు జగన్ వాదనకు ప్రముఖులు సైతం మద్దతు ఇస్తున్నారు. టీడీపీ నేతలు ఆ వాదనకు ఇంతకాలం మద్దతు ఇవ్వలేదు. తాజాగా టీడీపీ ఎంపీ జగన్ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఏపీ రాజకీయ వర్గాలో చర్చనీయాంశమైంది. మరోవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు 48 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 
 
ఈరోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2137కు చేరింది. ఈరోజు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 12 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 1142 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 948 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో కోయంబేడు మార్కెట్ కు వెళ్లినవారే కరోనా భారీన పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: