ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహానగరంలో ఉన్న వైరాలజీ ల్యాబ్ నుంచే పుట్టిందన్న వాదన రోజురోజుకూ బలపడుతోంది. చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయకపోవడం వల్లే.. నేడు ఇంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ప్రపంచ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నాయని, అన్నిరంగాలు దెబ్బతిన్నాయని అనేక దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇక మొదటి నుంచీ అమెరికా అధ్యక్షుడు అయితే.. చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకదశలో కరోనాను చైనీస్ వైరస్ అని కూడా అనేశారు. చైనాలో దర్యాప్తు చేస్తామని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అమెరికా ఆరోపిస్తోంది. దీనికితోడుగా ఆస్ట్రేలియా కూడా నిలిచింది. అంతర్జాతీయంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇక అప్పటి నుంచి రెండు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఇదే సమయంలో చైనా కూడా అమెరికాపై ఎదురుదాడి చేస్తోంది. అమెరికా ఆరోపణలను కొట్టిపారేస్తోంది. అసలు కరోనా వైరస్ అమెరికా ల్యాబ్లోనే పుట్టిందని వాదిస్తోంది.
ఇదిలా కొనసాగుతుండగానే..తాజాగా.. జర్మనీ రంగంలోకి దిగింది. జర్మనీకి చెందిన ఓ మ్యాగజైన్ కీలక కథనాన్ని ప్రచురించింది. చైనా అధినేత జిన్పింగ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబందించిన ఆధారాలు ఉన్నాయంటూ అందులో పేర్కొంది. జనవరి 21న వీరిద్దరి మధ్య సంభాషణ జరిగిందని, కరోనా వైరస్ను మహమ్మారిగా ప్రకటించడానికి మరికొంతకాలంగా వేచిచూడాలని జిన్పింగ్ టెడ్రోస్ను కోరాడని ఆ కథనంలో ఆరోపించింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, అయినా.. ఇంకా వేచిచూడాలని జిన్పింగ్ కోరాడని అందులో పేర్కొంది. ఈ కథనంపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఇదిలా ఉండగా.. తైవాన్ కూడా ఇటీవల కీలక అంశాలను వెల్లడించింది. డిసెంబర్లోనే కరోనా గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు మెయిల్ చేసినా.. పట్టించుకోలేదని తైవాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. అనేకమార్లు చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెనకేసుకురావడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది.