జనసేన పార్టీ రాజకీయ పరిస్థితిపై అందరిలోనూ సందేహాలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీని తమ భుజస్కంధాలపై మోస్తూ అధ్యక్షుడు కంటే ఎక్కువగా కష్టపడుతూ వస్తున్నారు జనసైనికులు. అయితే పార్టీ పరిస్థితిపై ఇప్పుడు వారిలో అనేక సందేహాలు నెలకొన్నాయి. 2024 నాటికి పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని బలమైన కోరికతో జనసైనికులు తమ శక్తికి మించి కష్టపడుతున్నారు. పార్టీ నుంచి ఆదేశాలు ఉన్నా, లేకపోయినా, క్షేత్రస్థాయిలో సహాయ కార్యక్రమాలు చేస్తూ, ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, అలాగే జనసేన పార్టీ పై సోషల్ మీడియాలో వచ్చే విమర్శల కు సమాధానాలు ఇస్తూ, మొత్తంగా గట్టిగానే కష్టపడుతున్నారు. ఈ విషయం పవన్ కు కూడా బాగా తెలుసు. అయితే జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై చాలా మంది జనసేన కార్యకర్తలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు బిజెపి ఏపీ ఎన్నికల్లో సొంతంగా ఒక్క సీటు సంపాదించే అవకాశం లేదని, అసలు క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి బలం, బలగం లేదు అనేది జనసేన అభిమానుల వాదన.
జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్నంత బలంగా బీజేపీ లేదని, కేవలం బిజెపి లో నాయకులు ఉన్నారు తప్ప కార్యకర్తలు ఎవరు లేరు అన్నది జనసేన కార్యకర్తల అభిప్రాయం. కానీ పవన్ తాజాగా నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజా సమస్యల విషయంలో బిజెపి నాయకులను, కార్యకర్తలను కలుపుకుని జనసేన కార్యకర్తలు ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే ఈ విషయంపై జనసేన కార్యకర్తలు నేరుగా పవన్ తీరుని ప్రశ్నిస్తున్నారు. బిజెపి నాయకులను కలుపు వెళ్లేందుకు తమకు ఏ మాత్రం ఇష్టం లేదని, క్షేత్రస్థాయిలో కష్టపడితే ఆ క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో వేసుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని , కష్టం మాది ఫలితం వారిది అన్నట్టుగా పరిస్థితి ఉందని జనసైనికుల బాధ.
అందుకే బీజేపీ విషయంలో తమ ఆవేదనను చెప్పినా, పవన్ మాత్రం బిజెపిని కలుపుకుని వెళ్లాల్సిందే అని, ఇందులో మరో మాటకు తావులేదు అంటూ జన సైనికులకు క్లారిటీ ఇచ్చేశారట. అయితే ఈ విషయంలో జనసైనికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలనే విషయాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు.