ఈ నెల 18 19 తేదీల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశాలను జెనీవాలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల దృష్టి భారత్ పైనే ఉంది. ఈ సమావేశంలో భారత్ నుంచి, చైనా నుంచి పాల్గొనే ప్రతినిధులు ఏం మాట్లాడుతారు అనే దానిపైనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణలు అవసరమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ తరఫున ప్రతినిధులు గట్టిగానే వాదనలు వినిపించే అవకాశం ఉంది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో తన తప్పేమీ లేదని చెప్పుకునేందుకు చైనా కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంకోవైపు.. అమెరికా తరపున కూడా పాల్గొనే ప్రతినిధులు అటు చైనాతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థను తీవ్రస్థాయిలో విమర్శించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని హెచ్చరించడంలో చైనా నిర్లక్ష్యం వహించిందని, దాని ఫలితంగానే నేడు ప్రపంచ దేశాలు విలవిలాడుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు వైరస్ బారిన పడుతున్నారని, అదే స్థాయిలో మరణాలు కూడా సంభవిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో కరోనా వైరస్ను చైనీస్ వైరస్ అంటూ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. అంతేగాకుండా.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధుల కేటాయింపును కూడా ఆపేశారు. అలాగే.. చైనాలో దర్యాప్తు కూడా చేపడుతామని ఆయన హెచ్చరించారు.
చైనాలోని వుహాన్లో ఉన్న వైరలాజీ ల్యాబ్ నుంచే వైరస్ పుట్టిందన్న వాదనను పలువురు నిపుణులు కూడా ఒప్పుకుంటున్నారు. ఇక మొదటి నుంచీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ కూడా చైనాను వెనకేసుకొస్తున్నారు. ప్రకృతి నుంచే వైరస్ పుట్టిందని, వైరస్లకు దేశాలు, సరిహద్దులతో సంబంధం ఉండదని ఆయన గట్టిగానే మొదట్లో ట్రంప్కు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగే ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశాలు వేడివేడిగా జరగడం ఖాయంగానే కనిపిస్తోందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అయితే.. దాదాపుగా 130కోట్ల జనాభా ఉన్న భారత్ కరోనాను ఎలా ఎదుర్కొంటోందన్న దానిపైనే ప్రధాన చర్చ ఉండే అవకాశం ఉందని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.