టీఆర్ఎస్ పార్టీ అధినేత‌గా కే చంద్ర‌శేఖ‌ర్ రావు విభిన్న రాజ‌కీయంతో ముందుకు సాగిన సంగ‌తి తెలిసిందే. త‌న‌దైన డైన‌మిజంతో ముందుకు సాగిన ఆయ‌న తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కూడా ప‌లు ప్ర‌త్యేక నిర్ణ‌యాలు తీసుకున్నారు. అలాంటి విభిన్న ఒర‌వ‌డిని కొన‌సాగిస్తూ తాజాగా మ‌రోమారు త‌న మార్కును చాటుకునే నిర్ణ‌యం తీసుకున్నారు. దేశంలోనే మునుపెన్నడూ జరుగని విధంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది అధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేడు‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించబోతున్నారు. పరిపాలనా వ్యవస్థకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమస్థ‌ అధికార యంత్రాంగంతో ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

 

రైతుల సంక్షేమం కోణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విభిన్న‌త‌కు చోటు క‌ల్పించార‌ని స‌మ‌చారం. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో  మొత్తం 32 జిల్లా కలెక్టరేట్లతోపాటు మొత్తం 600 కేంద్రాల నుంచి ఒకేసారి అందరు అధికారులు, సిబ్బంది ముఖ్యమంత్రితో సంభాషించనున్నారు. దాదాపు 20 వేలమంది ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌరసరఫరాలశాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈ సమావేశంలో పాల్గొంటారు. అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, విత్తనాభివృద్ధి కార్పొరేషన్‌ అధికారి, వ్యవసాయ విస్తరణాధికారులు పాల్గొంటారు. వీరితోపాటు జిల్లా, మండల, గ్రామస్థాయి రైతుబంధు సమితుల అధ్యక్షులు, కోఆర్డినేటర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. 

 

 

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో సాగుభూమి విస్తీర్ణం 1.10 కోట్ల ఎకరాలకు పైగా చేరడంతో రైతులకు లాభాలు వచ్చేలా చేయడంపై ముఖ్యమంత్రి ‌కేసీఆర్‌ కసరత్తు మొదలుపెట్టారు. రైతులంతా ఒకే పంట వేస్తే డిమాండ్‌ ఉండదని, మూస పద్ధతిలో వ్యవసాయం చేసే విధానానికి స్వస్తి పలుకాలని సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సాగయ్యే భూమిలో 50 లక్షల ఎకరాల్లో వరి, మరో 50 లక్షల ఎకరాల్లో పత్తి, మరో 10 లక్షల ఎకరాల్లో కంది పంట పండించాలని నిర్ణయించారు. నగరం, పట్టణాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లో కూరగాయలు పండించాలని నిర్ణయించారు. వరిలో కూడ సన్నాలు ఎక్కువగా పండించాలని భావిస్తున్నారు. ఇలా ఏ భూమిలో ఏ పంట పండించాలన్న దానిపై సీఎం కేసీఆర్‌ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో విస్తృతంగా చర్చిస్తారు.నియంత్రిత పద్ధతిలో పంటలను సాగుచేయాల్సిన అవసరం.. చేసే విధానంపై సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం చేస్తారు. గ్రామీణ స్థాయిలో పరిస్థితులపై అధికారులు ఇచ్చే సమాచారం ఆధారంగా సీఎం కేసీఆర్‌ తగిన సూచనలు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: