దేశంలో కరోనా కలకలం కారణంగా ఏర్పడిన ప్రస్తుత సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు రూ.20 లక్షల కోట్లతో జీడీపీలో 10 శాతానికి సమానమైన రెండో విడుత ఆర్థిక ప్యాకేజీని మోదీ సర్కార్ ప్రకటించింది. అయితే, ఈ నిధులను ఎక్కడి నుంచి తెస్తుంది? వీటిలో దాదాపు రూ.13 లక్షల కోట్లను వివిధ మార్గాల ద్వారా సమీకరించుకోనున్నట్టు ప్రకటించింది. మిగిలిన రూ.7 లక్షల కోట్లను నగదు ముద్రణ ద్వారా సమకూర్చాల్సిందిగా రిజర్వు బ్యాంకును కోరక తప్పదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అయితే, ఇందుకు పలు సాంకేతిక అంశాలు అడ్డు పడుతున్నాయి.
కొవిడ్-19 సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మంగళవారం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం నిధుల్లో రూ.6.8 లక్షల కోట్లను నగదు ముద్రణ ద్వారా సమకూర్చాల్సిందిగా కేంద్రం ఆర్బీఐని కోరే అవకాశముందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ (బీవోఎఫ్ఏ) తెలిపింది. కొవిడ్-19 కాటుతో అల్లాడుతున్న అమెరికా, జపాన్, యూరప్లోని మరికొన్ని ధనిక దేశాలతో పాటు టర్కీ, ఇండోనేషియా లాంటి దేశాలు క్వాంటిటేటివ్ ఈజింగ్, హెలికాప్టర్ మనీపై దృష్టి సారించాయి.
అయితే, ఇతర దేశాల వలే మన దేశంలోనూ ఆర్బీఐ ద్వారా నోట్లు ముద్రించుకోవడంపై పలు అంచనాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదనపు నగదు ముద్రణతో రూపాయి విలువ మరింత క్షీణించి ధరలు పెరుగుతాయి. దీంతో ద్రవ్యోల్బణం హద్దులు దాటి దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమై ముప్పు వాటిల్లుతుంది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని రిజర్వు బ్యాంకు 1994లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే నగదు ముద్రణ విధానానికి స్వస్తి పలికింది. కానీ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నగదు ముద్రణ కోసం ఆర్బీఐని ఆశ్రయించక తప్పదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.