బెంగళూరు మాజీ అండర్వరల్డ్ డాన్-టర్న్-యాక్టివిస్ట్, జయ కర్ణాటక వ్యవస్థాపకుడు ముత్తప్ప రాయ్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ క్యాన్సర్కు చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచాడు. బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా తాను ఐదేళ్లకు మించి బతకనని వైద్యులు తనకు ముందే చెప్పారని ఈ ఏడాది జనవరిలో ఓ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ముతప్ప రాయ్ వెల్లడించాడు. 5 బుల్లెట్లు తన శరీరంలోకి చొచ్చుకెళ్లినా బతకగలిగానని.. నాకు చావు అంటే భయం లేదు.. నేను ఎప్పుడూ సంతోషాగానే చనిపోతానని ఆయన అనేవారు.
ఆయన ఓ సాధారణ జీవితం గడిపి వ్యక్తి.. కష్టసుఖాలు అన్నీ తెలిసిన వ్యక్తి అంటారు. ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగిగా మొదలైన ఆయన ప్రస్థానం అండర్ వరల్డ్ డాన్ సాగింది. 1991లో కేంద్రం తీసుకొచ్చిన ఆర్థిక సరీళకరణ విధానాల నేపథ్యంలో బెంగళూరులో పెరిగిన రియల్ ఎస్టేట్ బూమ్పై పట్టు బిగించాడు. ఈ క్రమంలో రెండుసార్లు ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఓ కేసుకు సంబంధించి ఓరోజు బెంగళూరు కోర్టుకు హాజరవగా.. ప్రత్యర్థులు ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ దాడిలో ముతప్ప రాయ్కి ఐదు బుల్లెట్లు దిగాయి.
అప్పట్లో ఆయన చావు అంచుల వరకు వెళ్లారు.. కానీ అదృష్టం కొద్ది బతికిపోయారు.. కానీ క్యాన్సర్ తో మాత్రం పోరాడి ఓడిపోయారు. ముతప్ప రాయ్,కర్ణాటకలోని అగ్ర కులాల్లో ఒకటైన బంత్ కమ్యూనిటీ నుంచి వచ్చాడు. ఐశ్వర్య రాయ్,శిల్పా శెట్టి,సునీల్ శెట్టి.. వీరంతా ఆ కమ్యూనిటీకి చెందినవారే. 2000వ సంవత్సరంలో దుబాయ్ ప్రభుత్వం ముతప్ప రాయ్ను భారత్కు అప్పగించింది. దీంతో కొన్ని నెలలు అతను సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అదే సమయంలో తనపై ఉన్న అన్ని ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటకొచ్చాడు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ముతప్ప రాయ్ జీవిత కథ ఆధారంగా కన్నడలో వివేక్ ఒబేరాయ్ హీరోగా 'రాయ్' అనే సినిమా కూడా తెరకెక్కించాడు. మొత్తం మీద చాలా ఏళ్లు బెంగళూరు అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఏలిన ముతప్ప రాయ్ గురువారం కన్నుమూశాడు.