చేతికి దొరికిన కరోనా మహమ్మారిని ప్రధాని నరేంద్రమోడీ చేజేతులా వదిలేస్తున్నారా..? కరోనాను భారత్ బాగా కట్టడి చేస్తోందన్నప్రపంచం నమ్మకాన్ని మోడీ నిలబెట్టుకోలేకపోతున్నారా..? చూస్తుండగానే చైనాను దాటిపోయి లక్షవైపు పరుగులు తీస్తున్న పాజిటివ్ కేసులు ఈ సంకేతాలనే సూచిస్తున్నాయా..? రాష్ట్రాలను సమన్వయపర్చడంలో మోడీ విఫలం అయ్యారా..? అంటే తాజా పరిణామాలు మాత్రం ఔననే అంటున్నాయి. కరోనా వైరస్ కట్టడికి ఎంత తొందరగా.. మరెంత ఆవేశంగా రాత్రికి రాత్రే లాక్డౌన్ ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీ.. వైరస్పై పట్టుసాధించినట్టే కనిపించింది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకున్నట్టే అనిపించింది. ప్రపంచ దేశాలు సైతం ఇదే విషయాన్ని చెప్పాయి. లాక్డౌన్తో భారత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందని, వైరస్ను బ్రహ్మాండంగా కట్టడి చేస్తోందని ప్రశసంలు కురిపించాయి.
కానీ.. ఎక్కడో సమన్వయం లోపించింది.. మననం సేఫ్ జోన్లోనే ఉన్నామనుకుంటున్న తరుణంలోనే వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారత్లాంటి దేశాల్లో లాక్డౌన్ సడలింపులు ఇస్తే.. మరింత ప్రమాదకరపరిస్థితులు తలెత్తడం ఖాయమని పలువురు నిపుణులు హెచ్చరించారు. ఇప్పుడు అదే నిజమవుతోంది. ప్రధానంగా లాక్డౌన్ తర్వాత పలుమార్లు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ.. ఈ నిర్ణయం తీసుకునే ముందుమాత్రం అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించలేకపోయారు. సమన్వయపర్చలేకపోయారు. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ అమలు, తేదీల్లో కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా పలు రాష్ట్రాలు వ్యవహరించాయి. ఇంతటి కష్టకాలంలో ఒకే దేశం.. ఒకే నినాదాన్ని బలంగా వినిపించడంలో మోడీ విఫలం చెందారనే చెప్పొచ్చు.
నిజానికి.. లాక్డౌన్ విధించడానికి ముందు అసలు లక్షల కోట్ల సంఖ్యలో వలస కార్మికులు ఉన్నారన్న విషయాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించలేకపోయాయి. చేతిలో పనిలేక, తినేందుకు తిండిలేక.. ఉండేందుకు నిలువనీడలే.. వందలు.. వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి కాలినడక సొంతూళ్లకు బయలుదేరడంతో ప్రభుత్వాలు సోయిలోకి వచ్చాయి. లాక్డౌన్కు ముందస్తుగానే వారిని స్వస్థలాలకు పంపించి ఉంటే.. ఈ రోజు ఇంతటి దయనీయపరిస్థితులు వచ్చి ఉండేవికాదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. రోజురోజుకూ వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతున్న సమయంలో వలసకార్మికులను స్వస్థలాలకు తరలిస్తుండడంతో పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి.