కరోనా వైరస్ మనల్ని నీడలా వెంటాడుతుందనడానికి ఇదే నిదర్శనం.. కరోనాతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలనడానికి ఇదే ఉదాహరణ. కరోనా వైరస్ పోయినా.. మళ్లీమళ్లీ వస్తుందనడానికి సంకేతంగా మణిపూర్లో ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కరోనా రహిత రాష్ట్రంగా ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ ప్రకటించిన మూడు వారాల తర్వాత మణిపూర్లో తాజాగా కరోనా పాజిటివ్ కేసు నమోదై కలకల రేపుతోంది. 33 ఏళ్ల వ్యక్తి బుధవారం ముంబై నుంచి అద్దె వాహనంలో మణిపూర్కు చేరుకున్నాడు. అతడిని అదుపులోకి తీసుకున్న వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ అని తేలింది. అయితే జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జెఎన్ఐఎంఎస్) దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున క్యాన్సర్తో బాధపడుతున్న తన తండ్రి చికిత్స కోసం ముంబై వెళ్లడంతో అక్కడే కరోనా సోకిందేమోనని వైద్యులు అనుమానిస్తున్నారు. అతని తల్లికి కూడా కరోనా సోకినట్లు కుటుంబసభ్యులు తెలుపడం గమనార్హం.
ఏప్రిల్ 19న రాష్ర్టంలో వైరస్ భారిన పడ్డ ఇద్దరు కోలుకున్నారని, దీంతో ఇప్పడు కరోనా ఫ్రీ రాష్ర్టంగా మణిపూర్ ఉందని సీఎం ఎన్ బిరెన్ సింగ్ ప్రకటించారు. దాదాపు మూడు వారాల తర్వాత మళ్లీ కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం రాష్ర్టంలో ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లోనే 3,967 కొత్త కరోనా కేసులు నమోదుకాగా, 100 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్లో 82 వేలకు చేరువులో పాజిటివ్ కేసుల సంఖ్య ఉంది. మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 2,649 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 51,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అంతుచిక్కని విధంగా వైరస్ వ్యాప్తి చెందుతుండడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.