తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో  వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయరంగ నిపుణులు పలు సూచనలు చేశారు. తెలంగాణలో సాగుభూమి, సాగు పద్ధతులు, దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్లను అధ్యయనం చేసిన అనంతరం వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి ఏడాదికి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు ప్రభుత్వానికి, రైతులకు సూచించారు. వర్షాకాలంలో మక్కల సాగు ఏమాత్రం లాభసాటి కాదని, మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పత్తి సాగు శ్రేయస్కకరమని వారు తేల్చి చెప్పారు. తెలంగాణలో వానాకాలం పంటగా 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో కందులు వేయడం మంచిదని వారు సూచించారు.

 

 

ఈ సారి కరోనా ఉంది కాబట్టి రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని పంటలను కొనుగోలు చేసింది. కానీ ప్రతీ సారి ఈ పరిస్థితి ఉండద‌ని నిపుణులు పేర్కొన్నారు. ``ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే పండించాలి.  వరిని ఎక్కువగా పండించడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్ర అవసరాలు, బియ్యం మార్కెట్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో రెండు పంటలకు కలిపి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పండించాలి. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేస్తే రైతుకు ధర రాదు. ఈ 65 లక్షల ఎకరాల్లో సన్న, దొడ్డు రకాలు కలిపి వానాకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 35 లక్షల ఎకరాలు సాగు చేయాలి.`` అని సూచించారు. `వ‌రితో పోల్చుకుంటే పత్తి సాగు చాలా లాభదాయకం. తెలంగాణలో గతంలో పత్తి పంటను వర్షాల మీద ఆధారపడి సాగు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాగునీటి వసతి పెరిగింది. కాల్వల ద్వారా వచ్చే నీటితో పత్తిని సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. నాణ్యమైన పత్తి వస్తుంది. వరిలో ఎకరానికి 30 వేల నికర ఆదాయం వస్తే, పత్తి పంటకు ఎకరానికి అన్ని ఖర్చులు పోను 50 వేల వరకు ఆదాయం వస్తుంది. తెలంగాణలో 65 నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు చేయడం శ్రేయస్కరం. పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి, రైతులకు ఎంతో మేలు కలుగుతుంది.`` అని సూచించారు. 

 


ఇదిలాఉండ‌గా, నిపుణుల సూచనలపై తెలంగాణ‌ ప్రభుత్వం రాబోయే రెండు రోజుల పాటు చర్చిస్తుంది. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానాన్ని ఖరారు చేస్తుంది. అనంతరం సమగ్ర వ్యవసాయ విధానం, పంటల సాగు పద్ధతులపై క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: