లిక్క‌ర్ కింగ్‌, బ్యాంకుల‌కు వేల కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టి విదేశాల‌కు పారిపోయిన విజ‌య్ మాల్యా విష‌యంలో ఊహించ‌ని వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. బాకీలను ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు అప్పగింత కేసులో తనకున్న చివరి అవకాశాన్నీ గురువారం మాల్యా కోల్పోయారు. బ్రిటన్‌ చట్టాల ప్రకారం 28 రోజుల్లోగా మాల్యాను భారత్‌కు అప్పగించాల్సి ఉంటుంది. కాగా, కరోనాతో మాల్యా అప్పగింత ఆలస్యమయ్యే వీలున్నది. ఇదిలావుంటే యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌కు వెళ్లడానికీ మాల్యాకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

 

వేల కోట్ల రూపాయల పెట్టుబ‌డితో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ ప్రారంభించిన మాల్యా ఆ కంపెనీతో బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా బకాయిపడి వీటిని చెల్లించకుండా 2016, మార్చి 2న లండన్‌కు పారిపోయాడు. భారతీయ దర్యాప్తు సంస్థల అభ్యర్థనలతో 2017, ఏప్రిల్‌ 20న బ్రిటన్‌ అధికారులు అరెస్టు చేశారు. అప్పట్నుంచి సీబీఐ, ఈడీ మాల్యా అప్పగింత కోసం న్యాయపోరాటం చేస్తుండగా, లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్స్‌ కోర్టు.. భారత్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. దీనిపై బ్రిటన్‌ హైకోర్టుకు మాల్యా వెళ్లగా.. కింది కోర్టు తీర్పునే గత నెల ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేసుకోవడానికి 14 రోజుల గడువిచ్చింది. కానీ అప్పీల్‌కు అవకాశం లేకుండాపోయింది. భారత్‌కు అప్పగింత కేసులో తనకున్న చివరి అవకాశాన్నీ  మాల్యా కోల్పోయారు. బ్రిటన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడానికి అనుమతి లభించలేదు. దీంతో లండన్‌ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం త్వరలో భారత్‌కు మాల్యాను తీసుకువచ్చేందుకు లైన్‌ క్లియరైంది. బ్రిటన్‌ హోం మంత్రి ప్రీతీ పటేల్‌ ఈ తీర్పును అధికారికంగా ధ్రువీకరిస్తే.. భారత్‌కు మాల్యా అప్పగింత ప్రక్రియ మొదలు కానుంది. 

 

ఇదిలాఉండ‌గా మాల్యా త‌న‌దైన క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న బాకీలన్నీ చెల్లిస్తా తనపై ఉన్న కేసులన్నింటినీ కొట్టేయాలని మరోసారి మాల్యా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తానిచ్చే నగదును బ్యాంకులకు అందజేయాలని  సర్కారును కోరారు.  ‘రూ.20 లక్షల కోట్ల కొవిడ్‌-19 రిలీఫ్‌ ప్యాకేజీని ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా అభినందనలు. అయితే ప్రభుత్వ బ్యాంకులకు బాకీలు తిరిగి చెల్లిస్తానన్నా ఎందుకు నిరాకరిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని సోష‌ల్ మీడియాలో విన్న‌వించుకున్నాడు. ‘దయచేసి బేషరతుగా నా సొమ్మును తీసుకోండి. నాపై కేసుల్ని మూసేయండి’ అని వేడుకున్నాడు. ఇలాంటి త‌రుణంలో తాజా తీర్పు వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: