తెలంగాణలోని నిజామాబాద్ రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. గత లోక్సభ ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ కేసీఆర్ కుమార్తె.. అప్పటి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించారు. అప్పటి నుంచి అక్కడ పట్టు కోసం వీరిద్దరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ఏ మాత్రం వీలున్నా అర్వింద్ కు చెక్ పెట్టాలని కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నిజామాబాద్ లో అర్వింద్కు అదిరిపోయే షాక్ తగిలింది.
కార్పొరేషన్ పరిధిలోని పలువురు బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరారు.
నగరానికి చెందిన 8వ డివిజన్ కార్పొరేటర్ విక్రమ్గౌడ్, 9వ డివిజన్ సాధు సాయివర్ధన్, 50వ డివిజన్ కార్పొరేటర్ బట్టు రాఘవేందర్ (రాము)తో పాటు పలువురు నాయకులు కమలానికి జెల్ల కొట్టి గులాబీ గూటికి చేరిపోయారు. వీరంతా కవిత ప్లానింగ్ మేరకు స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరినట్టు సమాచారం. ఇక తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి... ఆయన చేపడుతోన్న జనరంజక పథకాలను చూసే తాము పార్టీ మారినట్టు పార్టీ మారిన కార్పొరేట్లు చెప్పారు.
ఇక తనపై ఎంపీ అర్వింద్ గెలిచింది గాలి వాటపు గెలుపు మాత్రమే అని.. వాస్తవానికి నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అన్నదే నిరూపించు కోవాలని కవిత ఎప్పకప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా ఆమె ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ఇప్పుడు ఆమె లోక్సభ నియోజకవర్గంతో పాటు జిల్లా పై మరింత గా పట్టు సాధించడంతో పాటు అర్వింద్ దూకుడు.. రాజకీయానికి పూర్తిగా చెక్ పెట్టాలని కసితో ఉన్నారు. ఈ క్రమంలో నే ఇప్పుడు బీజేపీ కి కాస్త గుండె కాయగా ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్ లోనే ఆ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు పార్టీ మారేలా చక్రం తిప్పి అర్వింద్ కు షాక్ ఇచ్చారు. అర్వింద్ ను ఈ నాలుగేళ్లు గట్టిగానే కాన్ సంట్రేషన్ చేస్తారన్నది ఖాయమే..?