భార‌త‌ దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ విధించిన విష‌యం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఎలాంటి వాహ‌నాలు తిర‌గ‌లేద‌ని.. అనుకుంటాం. కానీ.. ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎన్నివేల రోడ్డు ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయో తెలిస్తే షాక్ అవుతాము. దేశంలో మార్చి 25 నుంచి మే 16వ తేదీ వరకు 2 వేల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 368 మంది మృతి చెందినట్లు తేలింది. దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్న సేవ్‌లైఫ్‌ ఫౌండేషన్‌ సంస్థ ఇందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఈ గ‌ణాంకాల ప్ర‌కారం.. మొత్తం 368 మంది మృతుల్లో సొంతూళ్లకు వెళ్తున్న వలస కార్మికులు 139 మంది కాగా, అత్యవసర సేవల సిబ్బంది 27 మంది, ఇతరులు 202 మంది అని వెల్లడించింది. *368 మంది మృతుల్లో ఒక్క యూపీలోనే 100 మంది ఉన్నారు. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌(30), తెలంగాణ (22), మహారాష్ట్ర(19), పంజాబ్‌(17) ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నిటికీ వాహ‌నాల‌ అతి వేగమే కారణం* అని సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సీఈవో పీయూష్‌ తివారీ వెల్ల‌డించారు.

 

లాక్‌డౌన్‌ కారణంగా రోడ్లపై ట్రాఫిక్‌ చాలా తక్కువగా ఉండటం.. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో స్వస్థలాలకు వెళ్లాలన్న ఆత్రుత వంటి కారణాలతో వాహనాలను వేగంగా నడుపుతున్నాని.. ఈ క్ర‌మంలోనే ఇన్ని ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయ‌ని అన్నారు. దీంతోపాటు చాలా వరకు ప్రమాదాలు రాత్రి వేళల్లో, వలస జీవులు నడిచి వెళ్తుండగా లేదా నిద్రిస్తుండగా జరిగినవేన‌ని తెలిపారు. నిన్న ఉద‌యం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఏకంగా 23మంది వ‌ల‌స కూలీలు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో మ‌రో 20మంది గాయ‌ప‌డ్డారు. రెండు ట్ర‌క్కులు ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. అంత‌కుముందు కూడా రాత్రివేళ రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న‌వ‌ల‌స కూలీల‌ను బ‌స్సు ఢీకొన‌డంతో ఆరుగురు కార్మికులు దుర్మ‌ర‌ణం చెందారు. దేశంలో ఏటా సంభవించే 5 లక్షలకుపైగా రోడ్డు ప్రమాదాల్లో 1.50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా అవేస్తున్నారు విశ్లేష‌కులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: