దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. ఇక అహ్మదాబాద్లో నిత్యావసర సరుకులు, కూరగాయలు అమ్ముకునేవారికి వారం రోజుల పాటు భారీ సంఖ్యలో అధికారులు కోవిడ్ పరీక్షలు చేశారు. దీంతో షాకింగ్ న్యూస్ తెలిసింది. వారిలో 700 మంది ‘సూపర్స్ప్రెడర్స్ ’ అంటే వైరస్ను విస్తృతంగా వ్యాపింపజేసేవారు ఉన్నారని అధికారులు గుర్తించారు. మే 7 నుంచి 14 వరకు పాలు, మందుల షాపులు మినహా మిగిలిన షాపులన్నింటినీ మూసివేసి, ఈ పరీక్షలు జరిపారు. వైరస్ వ్యాప్తికి కారణమని భావిస్తున్న కూరగాయలు, నిత్యావసరాలు, పాలు అమ్మేవారు, పెట్రోల్ బంకుల్లో పనిచేసేవారు, చెత్త ఏరుకునే వారిని ‘సూపర్ స్ప్రెడర్స్’గా గుర్తించారు అధికారులు. గత వారం రోజుల్లో 33,500 మందిని స్క్రీనింగ్ చేసి, అందులో 12,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 700 మందికి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఐసోలేషన్లో ఉంచినట్టు అహ్మదాబాద్ కోవిడ్ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ వెల్లడించారు.
ఈ పరిణామాలతో ప్రజల్లో తీవ్ర ఆందోళనక వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు అహ్మదాబాద్లో 7,044పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు, 473 మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4,260, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,311గా ఉంది. కిరాణా షాపులు కూరగాయలు, పండ్ల విక్రేతలు తమ వ్యాపారాన్ని ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య నిర్వహించవచ్చు. అంతేకాకుండా, నగరంలోని పది కంటేన్మెంట్ జోన్లలో కొన్ని గంటలు దుకాణాలను తెరిచి ఉంచడానికి కూడా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతించింది. అలాగే.. "హెల్త్ స్క్రీనింగ్ కార్డులు" తీసుకునే విక్రేతలు లేదా దుకాణదారుల నుండి మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలకు ఏఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనికి ముందు ఏప్రిల్ 20 న ప్రారంభించిన పరీక్షలలో సుమారు 350 "సూపర్-స్ప్రెడర్లు కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు గురైనట్లు అధికారులు గుర్తించారు.