ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్కు ఇప్పటివరకు ఎలాంటి ముందుగానీ వ్యాక్సిన్ గానీ లేదు. ఈ మహమ్మారికి విరుగుడును కనిపెట్టేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి కచ్చితమైన ఫలితాలు మాత్రం రాలేదు. అయితే చైనాతో పాటు అమెరికా, భారత్, బ్రిటన్ తదితర దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కొన్ని కొన్ని దేశాల్లో జరుగుతున్న పరిశోధనల్లో కొద్దిమేరకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయిల్ లాంటి దేశం ఇప్పటికే యాంటీబాడీస్ను తయారు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. యాంటీబాడీస్ కరోనా వైరస్ కణాలను నిర్వీర్యం చేస్తున్నట్లు గుర్తించామని ఆ దేశం ప్రకటించింది. అలాగే బ్రిటన్ కూడా వ్యాక్సిన్ తయారీలో కీలక ముందడుగు వేసింది. ఈ దేశం చేస్తున్నతయారు చేస్తున్న వ్యాక్సిన్ను కోతులపై ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత మనుషులపై వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదో తెలుసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
భారత్ కూడా ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదిక్ ఫార్ములాలను వైరస్పై ప్రయోగిస్తోంది. ఈ వారంలోనే ట్రయల్స్ను కూడా ప్రారంభిస్తామని ఇటీవల కేంద్రమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోషాకింగ్ న్యూస్ వచ్చింది. అదేమిటంటే.. పరిశోధనా సంస్థలు కరోనాకు వ్యాక్సిన్ తయారు చేశాయంటే నమ్ముతాం మనం. కానీ.. ప్రపంచంలోనే అతిపెద్ద సిగరెట్ల తయారీ కంపెనీ వ్యాక్సిన్ తయారు చేసిందంటే మనం అంత సులువుగా నమ్మం. కానీ లండన్ కేంద్రంగా పనిచేసే ‘బ్రిటీష్ అమెరికన్ టొబాకో’ (బ్యాట్) కంపెనీ కరోనాను కట్టడి చేయగల ప్రయోగాత్మక వ్యాక్సిన్ను పొగాకు నుంచి అభివృద్ధి చేసినట్లు ప్రకటించుకుంది. కరోనా వైరస్ ఉపరితలంపై ఉండే ఓ ‘యాంటీజెన్’ను కృత్రిమంగా రూపొందించి, దాన్ని పొగాకు మొక్కల్లోకి చొప్పించామని, అవి పెరిగిన తర్వాత వాటి నుంచి ప్యూరిఫైడ్ యాంటీజెన్స్ తయారైనట్లు ఆ కంపెనీ వివరించింది. క్లినికల్ ట్రయల్స్కు ముందస్తుగా తాము నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని, ఆ తర్వాత మనుషులపై తొలిదశ ట్రయ ల్స్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే నిజమైతే.. మరో చరిత్ర మొదలైనట్టేనని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.