ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి గా యేడాది కాలం పూర్తి చేసుకోబో తున్నారు. ఈ యేడాది కాలంలో జగన్ ఎన్నో సంస్కరణలు చేపట్టారు. జగన్ ఎన్ని సంస్కరణలు చేపట్టినా ముందు నుంచి రైతు ప్రభుత్వం గా ముద్ర వేసుకునే ప్రయత్నాలే చేస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా జూన్ నెలలో ఖరీఫ్ సాగు పనులు మొదలవుతాయనే సంగతి తెలిసిందే. అయితే సాగు పనులకు అనుకూలంగా ప్రభుత్వం రైతులకు సమయానికి విత్తనాలని అందేలా చేస్తుంది. కానీ గత ఏడాది అలా జరగలేదు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే విత్తనాల కొరత వచ్చింది. దీని వల్ల రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ ఏడాది ఎన్నికలు ఉండటం వల్ల ముందున్న టీడీపీ ప్రభుత్వం విత్తనాల సేకరణ చేయలేదు. అసలు రైతులు చంద్రబాబుకు చివరి ఆరు నెలల్లో గుర్తు రాలేదనే చెప్పాలి. కేవలం ఎన్నికల మీద దృష్టి పెట్టి విత్తనాల విషయాన్ని గాలికొదిలేసింది. ఫలితంగా ఆ ప్రభావం నెక్స్ట్ వచ్చిన జగన్ ప్రభుత్వం మీద పడింది. అప్పుడే అధికారంలోకి రావడం పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల, రైతులకు సకాలంలో విత్తనాలు అందించలేకపోయారు.
తర్వాత ఎలాగోలా విత్తనాలు సేకరించి రైతులకు అందించారు. అయితే తప్పు టీడీపీ చేసినా దాని ప్రభావం మాత్రం వైసీపీ ప్రభుత్వం మీదే పడింది. అయితే గత ఏడాది జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా జగన్ ప్రభుత్వం ఈసారి ముందు జాగ్రత్త తీసుకుంది. 18వ తేదీ నుంచి విత్తన విక్రయాలు చేపట్టడానికి సిద్ధమైంది. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు రైతులకు ఈ ఏడాది త్వరగా విత్తనాలు అందిస్తున్నట్లు చెప్పారు.
ఏటా జూన్లో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియను త్వరితగతిన ప్రారంభిస్తున్నామని, ప్రత్యేక విధానంతో విత్తనాలను అందిస్తున్నామని తెలిపారు. ఇక జగన్ కూడా తాజాగా కలెక్టర్ల సమావేశంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చేసిన మోసం వల్ల రైతులు ఎలా ఇబ్బంది పడ్డారో వివరించి.. అది తమ ప్రభుత్వంలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని చెప్పారు.