క‌రోనా వైర‌స్ పాజిటివ్‌ కేసులతో కోల్‌కతా, హౌరాలు పోరాడుతుంటే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే సుమారు 300 మందికి పైగా నర్సులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి..మణిపూర్‌, త్రిపుర, ఒడిషా, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన వారి స్వస్థలాలకు తరలివెళ్లారు. దీంతో ఆయా ఆస్పత్రుల్లో రోగుల సేవలకు ఆటంకం ఎదుర‌వుతోంది. సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ సిన్హాకు తూర్పు భారత ఆస్పత్రుల సంఘం (ఏహెచ్‌ఈఐ) లేఖ రాసింది. కాగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం గత వారం 185 మంది నర్సులు మణిపూర్‌కు వెళ్లారు. ఇక శనివారం 169 మంది నర్సులు స్వస్థలాలకు వెళ్లారు. వీరిలో 92 మంది మణిపూర్‌కు చెందిన వారు కాగా, 32 మంది ఒడిషా..43 మంది త్రిపుకు చెందిన వారని కోల్‌కతా నగరానికి చెందిన ప్రైవేట్‌ ఆస్పత్రుల వర్గాలు వెల్ల‌డించాయి. అయితే..  నర్సులు ఎందుకు విధులకు రాజీనామా చేయడానికి ఒక‌టి రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

 

మణిపూర్‌కు తిరిగివచ్చిన వారికి ఆకర్షణీయ స్టైఫండ్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్‌ చేసిందని తెలిసిందని ఏహెచ్‌ఈఐ చీఫ్‌ ప్రదీప్‌ లాల్‌ మెహతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శకి రాసిన లేఖలో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మ‌రొక‌టి క‌రోనా వైర‌స్ బారి నుంచి త‌ప్పించుకోవ‌డం.. అయితే.. ఇది త‌ప్పుడు ప్ర‌చార‌మ‌ని మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆఫ‌ర్ చేసే ఈ దిశగా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని ఆయ‌న‌ చెప్పారు. ఏ ఒక్కరినీ తిరిగి రావాలని తాము కోరలేదని..కోల్‌కతా, చెన్నై, ఢిల్లీలో వారు సేవలందించడం పట్ల తాము ఎంతో సగర్వంగా భావిస్తున్నామని చెప్పారు. డాక్టర్లు, నర్సులు వారు పనిచేసే ద‌వాఖాన‌ల్లో అసౌకర్యంగా భావిస్తే అది వారు పనిచేసే సంస్థల నిర్వాహకులే అందుకు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. వారు అక్కడే పనిచేయాలని తాము వారిని ఒత్తిడి చేయలేమని చెప్పుకొచ్చారు. భద్రతకు సంబంధించిన ఆందోళన, తల్లితండ్రుల ఒత్తిడితోనే తాను ఉద్యోగానికి రాజీనామా చేశాన‌ని మణిపూర్‌ తిరిగి వచ్చిన ఓ నర్సు చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: